YSRCP : ఏపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో వద్దంటూ అధికార వైసీపీ చెబుతూ వచ్చింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామ స్థాయిలో వైసీపీ శ్రేణులు సన్నద్దంగా లేరన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందున ఎన్నికలు ఇప్పట్లో జరగవు అన్న ధోరణిలోనే ఆ పార్టీ నేతలు ఉండిపోయారు. అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని వైసీపీ జిల్లా నాయకులు చెబుతున్నా ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలని అని పలువురు మంత్రులే మదనపడుతున్నారుట. కొద్దిపాటి సమయం ఉన్నా పరిస్థితులను చక్కబెట్టుకునే వాళ్లం, హఠాత్తుగా ఎన్నికలు అంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే అని సన్నిహితుల వద్ద అంటున్నారుట. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా ఇలా ఎన్ని చెప్పినా కొన్ని పాంతాల్లో జనాలకు ఎన్నికలు వచ్చాయింటే ఏదో ఒకటి ఆశిస్తుంటారు. స్థానిక ఎన్నికలు అంటే గ్రామాల్లో వర్గాల మధ్య పోరు గట్టిగానే ఉంటుంది. ప్రతి ఓటు కీలకమే. ఈ పరిస్థితుల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో మద్యం, మనీ పంపిణీ కార్యక్రమాలు చేయాల్సిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మెప్పుపొందాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యధిక స్థానాలు కైవశం చేసుకుని చూపించాలి. పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడితే ఆయా ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలకు వైసీపీలో ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు సమస్య అయ్యింది.
ఎన్నికల సంఘం, ఏపి ప్రభుత్వం మధ్య జరిగిన యుద్దంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. ఎన్నికలు నిలిపివేయాలని ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. పిటిషన్ లను విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేష్ రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని తెలియజేస్తూ పిటిషన్లను కొట్టేసింది. ఈ వివాదంలో ప్రభుత్వ వాదనలను పూర్తిగా తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం ఉద్యోగ సంఘాల వాదనలను అసలు పరిగణలోకే తీసుకోలేదు. సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికలు ముంచుకు వచ్చాయి.
అసలు ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయని అధికార వైసీపీ ముఖ్యనేతలు భావించలేదు. అందుకే వారు ఎన్నికలకు సన్నద్దం కాలేపోయారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికల ప్రక్రియ చకచక జరిగిపోతోంది. ఈ పరిణామాలు ఊహించని వైసీపీ ముఖ్య నేతలకు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారుట. అనేక జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయలోపం, ఎమ్మెల్యేల పట్ల క్యాడర్ కు మద్య విబేధాలు ఉండగా అవి ఎలా సరిచేసుకుని ముందుకు సాగాలా అనే దానిపై మల్లగుల్లాలుపడుతున్నారు.