YSRCP: ఏపిలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనీ, ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా ఆ పార్టీ నేతలు పలువురు చేస్తున్న కామెంట్స్ పై ప్రభుత్వ సలహదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైసీపీ 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read More: CM YS Jagan: సీఎం జగన్ నోట మంత్రివర్గ విస్తరణ మాట..? కేబినెట్ లో హాట్ డిస్కషన్..!!
YSRCP: అధికారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు
ఈ సందర్భంలో సజ్జల మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతామని సజ్జల ప్రశ్నించారు. ఆ అవసరం తమకు ఏముందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టాలనుకునే వారే ముందస్తు ఎన్నికలకు వెళతారని సజ్జల అన్నారు. తాము ప్రజలను మభ్యపెట్టడం లేదనీ, అనుకున్న సమయానికే ఎన్నికలు జరుగుతాయని సజ్జల చెప్పారు. ప్రజలు తమకు అయిదేళ్లు అధికారాన్ని ఇచ్చారనీ, ఆ అధికారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం తమకేముందని సజ్జల ప్రశ్నించారు.
ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ హడావుడి
ఇదే సమయంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పైనా సజ్జల మాట్లాడారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రెండున్నరేళ్లకు ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు సజ్జల. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని చెప్పారు. పార్టీని బలోపేతం చేసుకోవడం, ప్రభుత్వ పాలన రెండు తమకు ముఖ్యమేనని సజ్జల అన్నారు. కేబినెట్ నుండి బయటకు వచ్చే వారి సేవలను పార్టీకి వినియోగించుకుంటామని సజ్జల చెప్పారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల దిశగా అడుగులు వేసే పార్టీ తమదని అన్నారు. ఏపిలో టీడీపీ ఉనికి కోల్పోతోందని సజ్జల విమర్శించారు. ఉనికిని కాపాడుకోవడానికి చంద్రబాబు ముందస్తు ఎన్నికలు అంటూ హడావుడి మొదలు పెట్టారన్నారు.