YSRCP : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే ప్రత్యర్థులను అవమాన పరిచేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు వివాదాస్పదం అయ్యింది. దీన్ని ఉదహరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తదితరులపై వైసీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
టీడీపీ ఫేస్ బుక్ లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని ఉద్దేశిస్తూ “ఒకప్పుడు జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన దగ్గర విధేయుడిగా ఉన్న వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి గురుమూర్తి ..” ఇప్పుడు పెద్దిరెడ్డి దగ్గర అంతే విధేయుడుగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ సీపీలో దళితులకు ఎదిగే స్వేచ్ఛ లేదు అందుకే ఈ సారి “వినిపిద్ధాం తిరుపతి గొంతు లోక్సభలో లక్ష్మి గొంతు” అని పేర్కొంటూ సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లను గురుమూర్తి వత్తుతున్నట్లుగా ఫోటో మార్ఫింగ్ చేసి ప్రచురించారు.
దీనిపై బాపట్ల వైసీపీ ఎంపి నందిగం సురేష్, వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్లు శుక్రవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు అందజేశారు. టీడీపీ పోస్టింగ్ తమ పార్టీ అభ్యర్థి గురుమూర్తి కులాన్ని, వ్యక్తిత్వాన్ని, వృత్తిని తీవ్రంగా కించపరిచినట్లు దళిత జాతి యావత్తు బావిస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ మరి కొందరు కుట్రపన్ని ఉద్దేశపూర్వకంగా దళితుడు అయిన గురుమూర్తిని అవమాన పరిచారని, కించపరచాలని తప్పుడు ఉలోచనలతో అవమానకరమైన రీతిలో పోస్టింగ్ ను తయారు చేసి వారి అధికారిక ఫేస్ బుక్ ద్వారా మరియు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తూ గురుమూర్తిని కించపరిచారని పేర్కొన్నారు. తక్షణం వారిపై చర్యలు తీసుకుని సదరు పోస్టింగ్ లన అధికారిక ఫేస్ బుక్ నుండి తొలగించేలా సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు, లోకేష్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరియు ఐటి యాక్ట్ కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని వైసీపీ నేతలు కోరారు.