YSRCP: వైసీపీ ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సూచించారు. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్ధేశం చేశారు. పనితీరు ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సర్వేల్లో పేరు లేకుంటే మొహమాటం లేకుండా టికెట్లు నిరాకరిస్తామని స్పష్టం చేశారు. గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రతి నెలా పది సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. జూలై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు జగన్ తెలిపారు. ప్లీనరీ తర్వాత మంత్రివర్గ వునర్వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు రూ.2కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
Read More: AP CM YS Jagan: సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం
YSRCP: బూత్ కమిటీలను బలోపేతం చేయాలి
ఏప్రిల్ పది నాటికి గ్రామస్థాయిలో ఉపాధి హామీ సహా అన్ని బిల్లులూ చెల్లిస్తామన్నారు. ఉగాదిన వాలంటీర్లకు సన్మానం, అవార్డులు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. ఇక ప్రజల్లోకి వెళ్లి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి రోజు నివేదికలు తెప్పించుకుని సమీక్షిస్తామని పేర్కొన్నారు. బూత్ కమిటీలను బలోపేతం చేయాలనీ, ఆ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలని చెప్పారు. ఏప్రిల్ నాటికి జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలన్నారు.
జిల్లాల వారీగా రిజినల్ కోఆర్డినేటర్లు
కొత్త జిల్లాల వారీగా రీజినల్ కోఆర్డినేటర్లను నియమిస్తామని జగన్ చెప్పారు. అదే విధంగా 26 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తామన్నారు. రాష్ట్రంలో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించినందున ప్రజల్లోకి గర్వంగా వెల్లగలమని అన్నారు. ప్రస్తుతం మనం చేస్తున్న యుద్ధం చంద్రబాబుతోనే కాదనీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి మీడియాతోనూ అని అన్నారు. వీళ్లు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ ఎమ్మెల్యేలకు తెలిపారు.