YSRCP: ఏపి మంత్రి కొడాలి నాని మరో మారు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియాపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంలోనే మంత్రి నాని సంచలన ప్రకటన చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈటీవీ, ఈనాడు, టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియాలను నిషేదిస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ నేతలు, మంత్రులు, పార్టీ నేతలు ఈ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ మాట్లాడటం గానీ చేయవద్దని ఆదేశించారు. గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కుల మీడియాలో ప్రజలను తప్పుదోవపట్టించేలా అసత్య కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.
Read More: AP CM YS Jagan: ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం జగన్ చర్చలు .. జగన్ చెప్పిన ఫైనల్ డెసిషన్ ఇదీ
YSRCP: వైఎస్ జగన్ పాలన 30 ఏళ్లు
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ ప్రజల సొమ్మును లూటీ చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్ పాలన రాష్ట్రంలో 30 ఏళ్ల ఉంటుందని మంత్రి నాని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడే సీఎం వైఎస్ జగన్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రం ముక్కలు అవ్వడానికి కారణం చంద్రబాబేనని దుయ్యబట్టారు మంత్రి నాని.
చంద్రబాబుకు సవాల్
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి. డబ్బా ఛానల్స్, కుల మీడియాను పెట్టుకుని ప్రభుత్వంపై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రతిపక్షాలను చూసి అయినా చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలన్నారు. అక్కడ ప్రతిపక్షాలు అధికార పార్టీకి సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో గెలుస్తానంటూ కుప్పంలో చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారనీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే తాను రాష్ట్రం వదిలిపోతానంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు హైదరాబాద్ వదిలి సొంత ఊళ్లో ఉంటారా అని ప్రశ్నించారు నాని. హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు తానే నిర్మించాననీ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారనీ, ఆ రెండు ఆయన నిర్మించినట్లు ఆధారాలు చూపితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ చేశారు.