Tollywood: టికెట్ల రేట్ల తగ్గింపుతో ఏపీ ప్రభుత్వానికి, తెలుగు సినీ పరిశ్రమకు పెరిగిన దూరాన్ని తగ్గించే ప్రయత్నాలు ఓపక్క జరుగుతున్నాయి. విషయం హైకోర్టుకు చేరడంతో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ ను ఉద్దేశించి నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా వాళ్లకు ఏపీ అనేది ఒకటుందని.. ఆ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి అనే విషయం తెలుస్తోందా..? హైదరాబాద్ లో సినిమాలు చేస్తూ మమ్మల్ని విమర్శిస్తారా..? పేదల కోసం సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే తప్పా..? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో పరిశ్రమలోని ఆయన సామాజికవర్గం, మిగిలిన వారు బలిసేలా చేశారు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
నిర్మాతల మండలి స్పందన..
దీనిపై తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది. ‘నిర్మాతలను ఉద్దేశించి ఎమ్మెల్యే హోదాలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం తగనిది. ఈ వ్యాఖ్యలు (Tollywood) పరిశ్రమ మొత్తాన్ని అన్నట్టుగా భావిస్తున్నాం. పరిశ్రమలో సక్సెస్ రేట్ 2 నుంచి 5 శాతం మధ్యే ఉంది. సినిమాలు తీసి ఆస్తులు అమ్ముకుని నష్టపోయిన నిర్మాతలు ఎందరో ఉన్నారు. కొందరు నిర్మాతలు మండలి నుంచి నెలకు 3,000 పెన్షన్ కూడా తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నిర్మాతలు, పరిశ్రమపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం’ అని ఓ లేఖ విడుదల చేసింది.
టాలీవుడ్ పై నిందలేల..
ఈ అంశంలో చంద్రబాబును ప్రసన్నకుమార్ విమర్శించొచ్చు కానీ.. సినిమా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగనిదనే చెప్పాలి. ప్రకృతి వైపరీత్యలప్పుడు హీరోలు ప్రభుత్వానికి సాయం అందిస్తున్నారు. ఫ్యాన్స్ చారిటీ చేస్తున్నారు. (Tollywood) సినిమా లేకపోతే ఎవరికీ ఎంటర్ టైన్మెంట్ ఉండదు. అయితే.. ఆమధ్య నిర్మాత సురేశ్ బాబు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానిస్తూ.. ‘చంద్రబాబు సీఎంగా ఉండగానే మోహన్ బాబు మీడియాలో తీవ్రంగా తిట్టారు. వైఎస్ఆర్, జగన్ ను ఎవరూ ఎప్పుడూ ఏమీ అనలేదు’ అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమను చంద్రబాబుకు లింక్ చేస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మరో వివాదానికి ఆజ్యం పోసినట్టైందని చెప్పాలి.