YSRCP: వైఎస్ఆర్ సీపీ అనుబంధ విభాగాల ఇన్ చార్జిగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయా విభాగాల బలోపేతానికి నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మహిళా విభాగం, రైతు విభాగం, ట్రేడ్ యూనియన్ నేతలతో భేటీ అయ్యారు. మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్ కే రోజా, వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తదితర నేతలతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ కమిటీలు అన్నీ యాక్టివ్ అవ్వాలన్నారు. వైసీపీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కమిటీలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటి వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలన్నారు. ఆయా విభాగాల నేతలతో వేరువేరుగా సమావేశమై బలోపేతానికి దిశానిర్దేశం చేశారు.
YSRCP: ఎస్సీలంతా అప్రమత్తంగా ఉండాలి
మరో పక్క పార్టీ కార్యాలయంలో నవరత్న సంక్షేమ పథకాల అవగాహన సభ జరిగింది. ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటి వ్యవస్ధాపకులు, నవరత్నాల పథకాలను గురించి ప్రచారం నిర్వహించే పెద్దిపోగు కోటేశ్వరరావు సభకు సమన్వయకర్తగా వ్యవహిరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఎదో ఒక నెపంతో ఎస్సీలలో విభేదాలు సృష్టించి విభజన తీసుకురావాలనే కుట్రతో చంద్రబాబు పనిచేస్తున్నారని, ఎస్సీలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. దళితులకు న్యాయం చేసేది, చేయగలిగేది ఒక్క వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని విజయసాయిరెడ్డి అన్నారు. ఎస్సీలలో మూడు ఉప కులాలకు సంబంధించి మూడు కార్పోరేషన్ లను ఏర్పాటు చేసి రూ.18వేల కోట్లకు పైగా సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. దళితుల అభ్యున్నతికి గతంలో ఎవ్వరూ చేయనంతగా సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దళితులంతా ఐక్యంగా ఉండి వైసీపీకి మద్దతుగా నిలవాలని కోరారు.
ఈ సభలో పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మన్, ఎంఎల్ ఏ మేరుగు నాగార్జున, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, తదితరులు ప్రసంగించారు.