టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శనాత్మక కథనాలు వెలువరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలనను వివరిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు కనీసం రెండు సీట్లయినా వచ్చేలా శ్రమపడితే మంచిదని విజయసాయి రెడ్డి సలహా ఇచ్చారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఇష్టారాజ్యంగా అధికారం చెలాయించిన నారా చంద్రబాబు నాయుడుకు నిజంగానే భయం పట్టుకుందని విమర్శించారు విజయసాయిరెడ్డి. అందుకేనేమో ఆయన ‘ఈ ప్రభుత్వానికి భయం లేకుండా పోయింది. ఆ భయాన్ని మనమే పుట్టించాలి,’ అంటూ ఇటీవల విజయనగరంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలకు ‘దిశానిర్దేశం’ చేశారని అన్నారు. ప్రజారంజకంగా, ఏ మాత్రం దిగులు లేకుండా పరిపాలిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చంద్రబాబు పార్టీ భయం పుట్టించడం అసలు జరిగే పనేనా? అని ప్రశ్నించారు. అధికారం లేదనే కుంగుబాటుతో జావగారిపోతున్న పార్టీ కార్యకర్తలను అరాజక మార్గంలో నడిపించడానికి చంద్రబాబు ఇలాంటి సలహాలు ఇస్తున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో జనసంక్షేమమే లక్ష్యంగా సాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి భయాందోళనలు, అనుమానాలు లేకుండా ముందుకు సాగుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. చక్కటి కార్యక్రమాలతో నిరంతరం ప్రజల మధ్యనే పనిచేస్తూ ఏడాది నాలుగు నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండో సారి గెలవడానికి సమాయత్తమౌతోందని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా అధికార వికేంద్రీకరణతో ప్రజల గడపలకే పాలన తీసుకొస్తోందని అన్నారు. ఇవేమీ కళ్లతో చూడలేని చంద్రబాబు అధికారం కోసం అలమటించిపోతున్నారని విమర్శించారు. మారిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం గెలుపు నీటి మీద రాతేనని తెలిసినా పార్టీని బతికించుకోవడానికి ఆయన నానా పాట్లు పడుతున్నారని విజయసాయి అన్నారు.
నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ, దాదాపు నాలుగేళ్లుగా వైసీపీ పాలనలో తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తుంటే.. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మీలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా?’ వంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలతో తన రోడ్ షోలకు వచ్చిన వారిని వేధిస్తున్నారని విమర్శించారు. ఈ 72 ఏళ్లు దాటిన వృద్ధ రాజకీయ నాయకుడు ఏం చెబుతాడో చూద్దామని వచ్చిన జనానికి చంద్రబాబు కనీసం వినోదం అయినా పంచకుండా దిక్కుమాలిన ప్రశ్నలతో, అడ్డగోలు ‘పిలుపుల’తో విసిగిస్తున్నారని దుయ్యబట్టారు. . ‘ఇదేం ఖర్మరా, బాబూ!’ అని ప్రేక్షకులు విలవిలలాడిపోయేలా ఆయన యాత్రలు సాగుతున్నాయన్నారు. 2014–19 మధ్యకాలంలో ఉత్తరాంధ్రకు అంతులేని ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే రీతిలో మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
నేడు 12.30 గంటలకు ప్రధాని మోడీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం.. విశేషం ఏమిటంటే..?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?