YSRCP: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు క్రమక్రమంగా మారుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు 2024 అయినప్పటికీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ పక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. అధికార వైసీపీ కూడా ఇప్పటి నుండే పార్టీపై దృష్టి సారిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా పార్టీ పరంగా ఇంత వరకూ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడినవారికి సరైన ప్రాధాన్యత లేకుండా పోతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రాకముందు పార్టీ కోసం విస్తృతంగా పని చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇటీవల పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పార్టీ అనుబంధ విభాగాల ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. మరో పక్క మంత్రివర్గ విస్తరణ చేపట్టిన తరువాత మంత్రివర్గం నుండి తప్పించిన మాజీలకు పార్టీ జిల్లా బాధ్యతలను అప్పగించనున్నారు.
YSRCP: సోషల్ మీడియాను యాక్టివ్ చేయడానికి
2019 ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా కార్యకర్తల ద్వారా విస్తృత కార్యక్రమాలను నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడానకి సోషల్ మీడియా యాక్టివ్ గా పని చేసింది. నాటి టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వారి తప్పులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడంతో పాటు వైసీపీ లక్ష్యాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇప్పుడు మరో సారి క్షేత్ర స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ సోషల్ మీడియాను యాక్టివ్ చేయడానికి, పార్టీ క్యాడర్ ను సమర్ధవంతంగా నడిపించేందుకు విజయసాయి రెడ్డి సమాయత్తం అవుతున్నారు. ఈ క్రమంలోనే వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు.
YSRCP: సోషల్ మీడియా కార్యకర్తలకు తగిన గుర్తింపు
పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లకు భరోసా కల్పించి వారి సేవలను మరింత వినియోగించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు విజయసాయి. వారి సమస్యలను కూడా తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి క్రియాశీల భూమికను పోషించిన సోషల్ మీడియా కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇచ్చి ప్రోత్సహిస్తామని హామీ ఇస్తున్నారు. అదే విధంగా పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకం కల్పించే విషయంపైనా పార్టీ అధినేత, సీఎం జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జూలై 8 వైసీపీ ప్లీనరీ తరువాత గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ కమిటీల పునః నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. ఈ సారి గతంలో కంటే సభ్యత్వ నమోదు అత్యధికంగా చేయాలని నిర్ణయించారు.
YSRCP: పార్టీ శ్రేణులకు హెల్ప్ లైన్
ఇదే సందర్భంలో సోషల్ మీడియా కార్యకర్తలకు విజయసాయి కీలక సూచనలు కూడా చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలపై వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం లేదనీ, సెటైరికల్ గా విమర్శలు చేయవచ్చని చెబుతున్నారు. ఇలా పోస్టింగ్స్ పెడితే కేసులు సైతం పెట్టలేరని పేర్కొంటున్నారు. ఎగ్జిక్యూటివ్స్, జ్యూడిషయిరీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయవద్దని వైసీపీ శ్రేణులకు సూచిస్తున్నారు. పార్టీ శ్రేణులకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా అందించేందుకు పార్టీ కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు విజయసాయి వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి విజయసాయి రెడ్డి సోషల్ మీడియా కోఆర్డినేటర్ వ్యవస్థ బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు.
YSRCP: ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పలు ప్రైవేటు రంగంలోని ఆటో మోబైల్, ఫార్మా, ఈ కామర్స్ తదితర కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించి తిరుపతిలో ఏప్రిల్ 2,3 తేదీల్లో, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్ప గోదావరి జిల్లాలకు సంబంధించి విశాఖలో ఏప్రిల్ 16,17 తేదీల్లో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి తాడేపల్లిలో ఏప్రిల్ 30వ తేదీన జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా 15 నుండి 20వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించే ఆలోచన చేస్తోంది వైసీపీ. పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ అర్హత ఉన్న కార్యకర్తలకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రైవేటు రంగంలో వీరికి అవకాశం కల్పించడం వల్ల అటు వారి విధులను నిర్వహిస్తూ మరో పక్క ఇటు సోషల్ మీడియా ద్వారా పార్టీకి సేవలను అందించనున్నారు.