YSRCP: తూర్పు గోదావరి జిల్లా వైసీపీ ప్రజా ప్రతినిధుల మధ్య విబేధాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ జిల్లాలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. పలువురు ఎమ్మెల్యేల మధ్య అంతర్గతంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ఎంపి మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య గతం నుండి విభేదాలు ఉన్నాయి. వీరి మధ్య ఆధిపత్య పోరు ఇతర వివాదాల నేపథ్యంలో గతంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వారితో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. ఆ తరువాత కొంత కాలంగా బాగానే ఉన్నా ఇటీవల చోటుచేసుకున్న ఓ వివాదంతో వారి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరికి బాహాటంగా విమర్శించుకునే స్థాయికి వచ్చింది.
తాజాగా ఓ వ్యక్తిపై దాడి జరిగిన విషయంలో చోటు చేసుకున్న వివాదం తో ఇద్దరి మధ్య తిరిగి ఆధిపత్య పోరు మొదలైంది.మీడియా సమావేశాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో వీరి చర్యలను సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్ వారిని తాడేపల్లి వచ్చి కలవాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. మంగళవారం (ఈ రోజు) ముందుగా వీరు వైవీ సుబ్బారెడ్డితో భేటీ కానున్నారు. వీరు ఇచ్చే సమాధానాలు అనంతరం సీఎం జగన్ వద్దకు వెళ్లనున్నారు. పార్టీ క్రమశిక్షణ తప్పి ఇద్దరు ప్రజా ప్రతినిధులు నీవు ఎంత అంటే నీవు ఎంత అనే స్థాయిలో సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో వీరిపై జగన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.