YSRCP News: ఏపి రాజకీయాల్లో వైసీపీ అనేది ఓ ప్రత్యేకమైన పార్టీ. అంటే రాజకీయాల్లో కొత్త పుంతలు.. రాజకీయాల్లో ఇలా కూడా చేయవచ్చా..? ఇటువంటి రాజకీయాలు కూడా చేయవచ్చా ..? అని అశ్చర్య గొలిపే పార్టీ వైసీపీ. అటువంటి పార్టీ స్ట్రాటజీలు, డైవర్షన్ పాలిటిక్స్ లో ప్రత్యర్ధులు చిక్కుకుంటే వాళ్ల పని అయిపోయినట్లే. వాళ్ల ట్రాప్ లో పడిపోయినట్లే !. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలకమైన అంశంలో తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత రచ్చచేయాల్సింది కానీ వెనుకబడిపోతుంది. వైసీపీ ట్రాప్ లో ఇరుక్కుపోతోంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి లాంటి తెలివైన వాళ్లు వేసిన ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ చిక్కుకోంటోంది అని పిస్తోంది.
YSRCP News: సాక్షిలో నాడు అలా.. నేడు ఇలా..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మూడు రోజుల క్రితం ఓ కీలకమైన అప్ డేట్ వచ్చింది. ఈ అప్ డేట్ అందరికీ తెలిసిందే. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితో పాటు డ్రైవర్ దస్తగిరి మొత్తం ఈ నలుగురు కలిసి హత్య చేశారనీ సీబీఐ దర్యాప్తులో తేల్చారు. ఇదే విషయాన్ని అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. అయితే ఈ హత్యను వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి లు చేయమన్నారనీ, వాళ్లే తెరవెనుక ఉన్నారనీ ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వ్యాగ్మూలంలో పేర్కొన్నాడు. వాళ్ల పాత్ర ఉందా లేదా అనేది ఎర్ర గంగిరెడ్డి మాత్రమే నిర్ధారించాల్సి ఉంటుంది. వాళ్ల పాత్ర ఉందా లేదా అనేది పక్కన బెడితే .. వివేకానంద రెడ్డి హత్య కేసు రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల నుండి సంచలనాత్మకంగా ఉంది. ఎన్నికలకు ముందు ఆ హత్యను చంద్రబాబే చేయించాడనీ, టీడీపీయే చేయించిందనీ, సీబీఐ విచారణ కావాలని జగన్మోహనరెడ్డి అడిగారు. ఎన్నికలు అయి తాను సీఎం అయిన తరువాత ఆ కేసును ఎలా నెమ్మదించాలా అని విచారణ జరగకుండా ఆపేయించారు. సీబీఐ విచారణ కూడా వద్దు అంటూ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇదంతా ఇలా జరుగుతుంటే సాక్షి మీడియాలో మాత్రం నారాసుర వధ అంటూ పెద్ద వార్త వేశారు. అదే సాక్షిలో నిన్న బెంగళూరు భూసెటిల్మెంట్ లావాదేవీల్లో కొంత అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ లో పంపకాల్లో తేడా వచ్చి ఎర్ర గంగిరెడ్డి అండ్ బ్యాచ్ హత్య చేసినట్లు కథనం వచ్చింది. ఆనాడు నారాసుర వధ అంటూ చంద్రబాబే చేయించాడంటూ రాసిన సాక్షి ఇప్పుడు ఇలా ఎందుకు రాసింది.
లోకేష్పై విజయసాయి ఘాటు వ్యాఖ్యలతో..
అయితే దస్తగిరి చెప్పిన వాగ్మూలంలో తెరవెనుక ఉన్న వారి పేర్లు కూడా చెప్పినా టీడీపీ దాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. దానికి కారణం ఏమిటంటే దస్తగిరి ఇచ్చిన వ్యాగ్మూలంపై టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి చాలా తెలివిగా నారా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ వాళ్లు వివేకా అంశాన్ని పక్కన పెట్టేసి విజయసాయి రెడ్డిపై విమర్శలు చేయడం ఆరంభించారు. మా నాయకుడు లోకేష్ పై విమర్శలు చేస్తావా అంటూ విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఇక్కడే కనబడుతుంది కదా డైవర్షన్ పాలిటిక్స్. ఓ తప్పు జరిగినప్పుడు దాని నుండి దృష్టి మరల్చాలంటే మరేదో గొడవ, రచ్చ చేస్తే పాత వ్యవహారం మరుగున పడిపోతుంది. నిన్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో గొడవలు జరగకపోయినా, లోకేష్ పై విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయకపోయినా వివేకా హత్య కేసు అంశం వారం రోజుల పాటు మీడియాలో వార్తలా ఉండేది. అంత పెద్ద సంచలన అంశం ఒక్కసారిగా చప్పబడిపోయింది. ఇదంతా చూస్తుంటే వైసీపీ ట్రాప్ లో పడిన టీడీపీ వాళ్లు సంచలన వార్తను వదిలివేసినట్లు కనబడుతుంది కదా..!?