Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తన పదోన్నతి సందర్భంగా విద్యార్హతలు తప్పుగా చూపారనే ఆరోపణలతో ఆయన్ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 477 (A ), 466, 467, 468, 471,465,420, R/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను సీఐడీ కార్యాలయానికి తరలించడం.. మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే.. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక్కడ అశోక్ బాబును ఏ ఆరోపణలతో అరెస్టు చేశారో.. కోర్టులో అవే ఆరోపణలను నిరూపించలేకపోవడం మరొక ఎత్తు. ఇక్కడ రాజకీయ విమర్శలు పక్కనపెడితే.. అశోక్ బాబును కావాలనే కక్షతో అరెస్టు చేయించింది వైసీపీ ప్రభుత్వం అనే నిందను భరించాల్సి వస్తోంది.
నిజంగా అలా జరిగుంటే..
అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో తప్పుడు సర్టిఫికెట్లతో పదోన్నతి పొందారనేది ప్రధాన అభియోగం. ఆయన ఇంటర్మీడియట్ మాత్రమే చదివి.. శాఖకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపణ. అయితే.. అశోక్ బాబు శాఖాపరమైన పరీక్షలు రాసి పదోన్నతి పొందారని అంటున్నారు. ఈ పరీక్ష పాసైతే డిగ్రీ అర్హత అవసరం లేదని తెలుస్తోంది. పదోన్నతి పొందిన తర్వాత కూడా నకిలీ సర్టిఫికెట్లు ఇస్తే అది కూడా నేరమే అవుతుంది. అయితే.. అశోక్ బాబుపై కోర్టులో ఈ వివరాలను ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. కోర్టులో ఇందుకు సంబంధించి ఆధారాలు ప్రవేశపెట్టామని చెప్తున్న ప్రభుత్వం ప్రజల ముందే ఆరోపణలు నిజం చేసినా ప్రభుత్వ వాదన సమర్ధనీయంగా ఉండేది.
ఏం సంకేతాలిస్తున్నట్టు..
కానీ.. ఇక్కడ అదేమీ జరగలేదు. పైగా.. బెయిల్ కూడా రావడంతో ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందా..? రాజకీయంగా తనపై విమర్శలు చేస్తే సహించేదా..? అనే సంకేతాలు ప్రభుత్వం తనకు తానే ప్రజల ముందు చూపుతున్నట్టు అవుతోంది. ఆరోపణలు నిరూపించే సందర్భంలో కోర్టులో ప్రభుత్వం విఫలమవుతోందనే విమర్శలకు ప్రభుత్వం తానే ఊతమిచ్చుకుంటోందని చెప్పాలి. పైగా.. అశోక్ బాబు అరెస్టుతో టీడీపీ నేతల నిరసనలు, అరెస్టులు, చంద్రబాబు పరామర్శలతో.. ప్రభుత్వం రాజకీయంగానే ఇదంతా చేస్తోందా..? అనే సంకేతాల్ని ప్రజల ముందుకు తీసుకెళ్తోన్నట్టుంది. ఇటువంటి అంశాల్లో ప్రభుత్వం మరింత క్లారిటీతో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది..!