YSRCP:రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండి రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మరల అధికారంలోకి వచ్చేది తామేననీ, జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీని మరో సారి గెలిపిస్తాయనీ వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఒక్క సారి అవకాశం ఇవ్వండి అంటూ వేడుకుని అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారనీ టీడీపీ విమర్శిస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల పంపిణీ తప్ప అభివృద్ధి పనులు ఎక్కడా జరగడం లేదని పేర్కొంటోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారనీ, ఈ సారి అధికారం తమదేనని టీడీపీ పేర్కొంటోంది.
YSRCP: నెల్లూరు జిల్లాలో
అయితే ఈ రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో కొన్ని వర్గాలు మాత్రం అధికార పార్టీకి దూరమయ్యాయనే మాట మాత్రం వినబడుతోంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వానికి మంచి పేరు ఉన్నప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది అని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్న మాట. పలు జిల్లాల్లో గ్రూపు తగాదాలు వైసీపీకి మైనస్ అవుతాయని కూడా అంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పలువురు అధికార పార్టీ నేతలే అక్రమ వ్యాపారాలకు తెరలేపారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ తీరుపై ఆ జిల్లాలోని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ గెలుపుకు పని చేసిన వాళ్లే కొందరు ఇప్పుడు పక్కకు జరిగారనే మాట వినబడుతోంది.
గూడూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ద్వితీయ శ్రేణి నేతలే ఆరోపిస్తున్నారు. జిల్లాలో భూదందాలు, అవినీతి పెరిగిపోయిందని జడ్పీటీసీ, ఎంపీటీసీలు బహిరంగంగానే ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నేతల అవినీతి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో వారిపై వస్తున్న విమర్శలను సరిచేసుకోవడంతో పాటు అభివృద్ధిపై దృష్టి పెడితే తప్ప లేకుండా రాబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో గతంలో వచ్చిన ఫలితాలు వైసీపీకి రావని చెబుతున్నారు.