Ysrcp: విజయవాడలో బాలిక ఆత్మహత్య ఉదంతం బాలికలు, మహిళల రక్షణపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది. తనకు ఎదురవుతున్న దారుణ పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక దయనీయ పరిస్థితుల్లో బాలిక ఈ లోకాన్ని వీడటం అందరి హృదయాల్ని బాధిస్తోంది. అయితే.. ప్రతీదీ రాజకీయం అయిన నేటి రోజుల్లో ఈ దారుణం కూడా రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా.. బాలికను వేధించిన వ్యక్తి ఓ టీడీపీ నేత. వయసు 50ఏళ్లుకు పైగా వయసు. నిందితుడికి శిక్ష కఠిన పడాలంటూ రాష్ట్రం మొత్తం నినదించింది. అయితే.. ఇలాంటి సమయాల్లో ప్రతిపక్షాలు రోడ్డెక్కి బాధితులకు న్యాయం జరగాలి.. ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్లు చేస్తాయి. కానీ.. ఇక్కడ రాజకీయ జోక్యం చేసుకుంది. జరిగిన ఘటనలో టీడీపీ నేత నిందితుడు కావడంతో అధికారంలో ఉన్న వైసీపీ కూడా ధర్నాలు, నిరసనలతో రోడ్డెక్కింది.
ఎవరికి ఉపయోగం..?
ఘటనపై ఫ్లెక్సీలు వేసి అందులో చంద్రబాబు, లోకేశ్ ఫోటోలు వేసి మరీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు వైసీపీ నేతలు. జిల్లా, నియోకవర్గ కేంద్రాల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి. నిందితుడు టీడీపీ వ్యక్తి కావడంతో వైసీపీ నేతలు ఇలా ప్రదర్శనలు చేశారు. కాకుంటే.. ఈ విధంగా చేసేవారా..? అనేది ప్రశ్న. ఘటనపై హోంమంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. అయినా.. వైసీపీ నేతల నిరసనల ప్రదర్శన చూస్తుంటే తమ ప్రభుత్వ హయంలో మహిళలకు రక్షణ లేదని ఒప్పుకుంటున్నారా..? అనే అనుమానం కలిగించేలా ఉందన్న విమర్శలూ వస్తున్నాయి.
రాజకీయం ముఖ్యమా.. న్యాయం ముఖ్యమా..?
జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేయడంలో అర్ధం ఉంది కానీ.. రాజకీయ రంగు పులిమి చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు వేసి టీడీపీని నిందిస్తే ఒరిగేదేమీ లేదు. నిందితుడు టీడీపీ వ్యక్తి అని తేలాక కొత్తగా వైసీపీ నేతలు ప్రచారం చేయడంలో అర్ధం లేదు. టీడీపీ నుంచి నిందితుడ్ని సస్పెండ్ చేయడం కంటి తుడుపు చర్య.. రాజకీయం అని అందరికీ తెలుసు. కానీ.. వైసీపీ శ్రేణులు టీడీపీ హయాంలో, తమ హయాంలో జరిగిన దారుణాల పర్సంటేజీ.. అంటూ చెప్తున్న లెక్కల వల్ల ఎవరికి లాభం. ఇటువంటి దారుణాలు జరుగకుండా చట్టాలు మరింత కఠినతరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ పని సక్రమంగా చేయనిద్దాం..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?