YSRCP: ఏపి లో రేపు నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కేబినెట్ లిస్ట్ సిద్దం చేశారు. నూతన మంత్రుల జాబితాను గవర్నర్ కార్యాలయానికి సీల్డ్ కవర్ లో పంపించారు. అయితే మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ కూర్పులో చోటు కల్పించకపోవడంతో ప్రకాశం జిల్లాకు చెందిన తాజా మాాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో బాలినేనిని బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. పది నిమిషాల పాటు బాలినేనితో సజ్జల మాట్లాడి వెళ్లారు.
మాచర్లలో సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కేబినెట్ లో చోటు ఇవ్వకపోవడంతో ఆ నియోజకవర్గ పరిధిలోని అయిదు మండలాల్లోని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామూహిక రాజీనామాలు చేస్తామంటూ ప్రజా ప్రతినిధులు హెచ్చరించారు. మండల కేంద్రమైన రెంటచింతలలో ప్రధాన రహదారిపై పిన్నెల్లి అనుచరులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు తలగబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఓ మహిళా కార్యకర్తల మంటల్లో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోబోగా అప్రమత్తమైన ఇతర కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. మరో పక్క ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సీఎంఓ నుండి సీఎం సెక్రటరీ ధనుంజయరెడ్డి ఫోన్ చేసి సముదాయించే ప్రయత్నం చేయగా మీరు, ప్రభుత్వం చూపిన అభిమానానికి థ్యాంక్స్ అంటూ పిన్నెల్లి ఫోన్ కట్ చేశారు. ఆ తరువాత సెల్ స్విచ్ ఆఫ్ చేశారు.
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆందోళన నిర్వహించారు. ఒంగోలు మంగమురు రోడ్డు జంక్షన్ వద్ద సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మంత్రివర్గంలోకి బాలినేనిని తీసుకోవాలంటూ అభిమానులు డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో బాలినేని అభిమానులు ఒంగోలు వైసీపీ కార్యాలయానికి చేరుకుని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు జిల్లాకే చెందిన తాజా మాజీ మంత్రి మేకతోటి సుచరిత తీవ్ర మనస్థాపంతో రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వినబడుతున్నాయి. ఎస్సీ మంత్రులను అందరినీ కొనసాగిస్తూ తనను మాత్రమే తప్పించారనీ, తాను చేసిన తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు సుచరిత. రెండు రోజులుగా సుచరిత కుటుంబ సభ్యులు సజ్జల కలవడానికి ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. పలువురు అభిమానులు, దళిత సంఘాల నేతలు సుచరిత నివాసానికి చేరుకున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో భావోద్వేగానికి గురై కంట తడిపెట్టారు. తాను పార్టీలోకి తీసుకువచ్చిన కాకాని గోవర్థన్ రెడ్డికి మంత్రి వర్గంలోకి అవకాశం కల్పించి తన పేరు పరిశీలనలోకి తీసుకోకపోవడంపై సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే జగన్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని ఉదయభాను అనుచరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బైక్ పై పెట్రోల్ పోసి తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశించిన ఉదయభాను తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. ఉదయభాను కు మంత్రి వర్గంలో స్థానం లభించకపోవడంపై నిరసనగా డీసిఎంఎస్ డైరెక్టర్ గింజుపల్లి రవికుమార్ తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా నుండి ఎవరికీ చోటు లభించలేదు.