YSRCP Rajya Sabha: త్వరలో ఏపి నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఖాళీ అవుతున్న ఏపి, తెలంగాణతో సహా 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. ఏపి నుండి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలం వరకూ విజయసాయి రెడ్డి, బీసీ సామాజికవర్గానికి చెందిన బీదా మస్తాన్ రావు, కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణి, ఆదానీ కుటుంబం నుండి ఒకరికి అవకాశం లభించనున్నట్లు ప్రచారం జరగ్గా, అదానీ కుటుంబం రాజ్యసభ రేసులో లేదని స్పష్టం అయ్యింది. మీడియాలో వస్తున్న కథనాలను ఆదానీ గ్రూపు ఖండించింది. అయితే అనూహ్యంగా మరో ఇద్దరి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
YSRCP Rajya Sabha: తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆర్ కృష్ణయ్య
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి, బీదా మస్తాన్ రావు పేర్లు దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వస్తుండగా, మరో రెండు స్థానాల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ తరుణంలో బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకోవడంతో రాజ్యసభ అభ్యర్ధిత్వంపై చర్చించేందుకే వచ్చారని ప్రచారం జరుగుతోంది. సీఎం వైఎస్ జగన్ కర్నూలు పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో సీఎం వచ్చే వరకూ ఆర్ కృష్ణయ్య వెయిట్ చేసి సాయంత్రం కలుస్తారని సమాచారం. ఆర్ కృష్ణయ్య గతంలో హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఎం రామ్మోహన్ గౌడ్ పై విజయం సాధించారు. 2018 తరువాత ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. బీసీ సంక్షాల అధ్యక్షుడుగా కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఏపిలో వైసీపీ సర్కార్ కు అనుకూలంగా..
అయితే ఏపిలో వైసీపీకి ఆర్ కృష్ణయ్య అనుకూలంగా ఉన్నారు. గత ఏడాది సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్ పాలనను ప్రశంసలతో ముంచెత్తారు. ఎక్కడా అవినీతి తావులేకుండా పాలన అందిస్తున్నారనీ, జనరంజకమైన నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారని ఆర్ కృష్ణయ్య నాడు ప్రశంసించారు. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులకు సంబంధించి 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ అసెంబ్లీలో చట్టబద్దత కల్పించారనీ, 56 బీసీ ఉప కులాలకు కార్పోరేషన్లు నెలకొల్పడంపై ఆర్ కృష్ణయ్య కితాబు ఇచ్చారు. బీసీ వర్గాల్లో మంచి పట్టు ఉన్న నేత అయిన ఆర్ కృష్ణయ్య వైసీపీ తీర్ధం పుచ్చుకుంటే పార్టీకి మరింత ప్లస్ అవుతుందన్న భావనలో జగన్ ఉన్నట్లు సమాచారం.
అందుకే ఆర్ కృష్ణయ్యకు అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అనంతరం దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో రాజ్యసభ స్థానాన్ని జగన్ వ్యక్తిగత న్యాయవాది, సినీ నిర్మాత నిరంజన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సామాజిక సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం వైఎస్ జగన్ చివరి నిమిషంలో ఎటువంటి నిర్ణయాలను వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీ, రెండు రెడ్డి సామాజిక వర్గాలకు ఇస్తారా..? లేక ఒకటి మైనార్టీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం కల్పిస్తారా..? అనేది తేలాలంటే ఒకటి రెండు ఆగాల్సిందే!.