YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్ధిత్వాల ఖరారు చాలా డిఫరెంట్ గా ఉంది. వైఎస్ జగన్మోహనరెడ్డి ఫలానా నేతకు టికెట్ ఇవ్వనున్నారు అనే విషయం లిస్ట్ బయటకు వచ్చే వరకూ ఆ పార్టీ నేతలకూ తెలియదు. తెలుగుదేశం పార్టీలో అయితే ముందుగా కొన్ని లీక్ లు, పుకార్లు రకరకాలుగా వచ్చేస్తాయి. నాలుగైదు రోజుల్లో ఎమ్మెల్యే టికెట్లు గానీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు గానీ వెల్లడిస్తారు అనుకుంటే ముందుగానే పేర్లు బయటకు వస్తాయి. లాబీయింగ్ లు పని చేస్తాయి. చంద్రబాబు చుట్టూ ఉండే కోటరీ ద్వారా పేర్లు ముందుగా మీడియాకు లీక్ అవుతాయి. అవసరమైన వారు లాబీయింగ్ లు చేసుకునే అవకాశం కూడా టీడీపీలో ఉంటుంది. కానీ వైసీపీలో లాబీయింగ్ లు కుదరవు, వైఎస్ జగన్మోహనరెడ్డి ఓ పక్క అంచనాతో ఫిక్స్ అయి ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే..? రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎటువంటి మార్పులు ఉంటాయి అనే దానిపై పార్టీలో అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి.
YSRCP: 20 రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో మార్పు..?
రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉండగా 28 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ 28 స్థానాల్లో 20 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రిజర్వుడ్ నియోజకవర్గాలు కావడం వల్ల అక్కడి పరిస్థితులను బట్టి ఇక్కడి నుండి అక్కడకు, అక్కడి నుండి ఇక్కడికి అన్నట్లుగా అభ్యర్ధులను మార్చవచ్చు. పనితీరు బాగోలేని కొందరిని పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా తగాదాలు, గ్రూపు రాజకీయాలు ఉంటాయి. ఎందుకంటే.. అక్కడి ఎమ్మెల్యే రిజర్వుడు. అక్కడ నియోజకవర్గంలో మొదటి నుండి పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇతర సామాజికవర్గ నేతకు పట్టు ఉంటుంది. నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంలో ఆర్ధికపరమైన వ్యవహారాలు ఈ నేతలు చూస్తూ ఉంటారు. వీరు కీలకమైన నామినేటెడ్ పదవుల్లో ఉంటాయి. ఎమ్మెల్యేలు స్టాంప్ లుగా (కొన్ని చోట్ల) ఉండాల్సి వస్తోంది. ఈ నియోజకవర్గాల్లో మొదట్లో బాగానే ఉన్నా తరువాత తరువాత ఎమ్మెల్యేకి, నాయకుడికి మధ్య ఆధిపత్యం విషయంలో విబేదాలు, గొడవలు వస్తుంటాయి.
రిజర్వుడు నియోజకవర్గాల్లో విభేదాలు
ఉదాహరణకు టీడీపీ విషయంలో చూసుకుంటే 2019 ఎన్నికలకు ముందు పాయికారావుపేటలో ఎమ్మెల్యే అనితకు టికెట్ ఇవ్వద్దు అని గొడవ, అదే విధంగా కొవ్వూరులో జవహార్ కు సీటు ఇవ్వొద్దు అని గొడవ, అలాగే తిరువూరు. సంతనూతలపాడు, ఎర్రగుండపాలెం నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చారు. వైసీపీలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. చాలా రిజర్వుడు నియోజకవర్గాల్లో విభేదాలు బయటకు వస్తున్నాయి. ఇటీపల పాయికారావుపేటలో గొల్ల బాబూరావుకు టికెట్ ఇవ్వొద్దు అంటూ గొడవ ఉంది. గుంటూరు జిల్లా వేమురూ. తాడికొండ, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఈ పరిస్థితులు ఉన్నాయి. తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేక వర్గం తయారు అయ్యింది.
YSRCP: జగన్మోహనరెడ్డి వద్ద ఓ లిస్ట్
ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి జగన్మోహనరెడ్డి ఒక లిస్ట్ ప్రెపేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఉదాహారణకు నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యేగా వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గతంలో తిరుపతి ఎంపీగా పోటీ చేశారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా వచ్చారు. 2019 లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత సొంత పార్టీ నాయకులకు ఆయనకు విభేదాలు వచ్చాయి. పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కార్యకర్తలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. అక్కడ చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. అక్కడ ఉన్న అంతర్గత సమాచారం ఏమిటంటే దివంగత మాజీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి గూడురు టికెట్ ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే బల్లి దుర్గాప్రసాద్ గూడూరు నుండే గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తరువాతనే ఆయన తిరుపతి వైసీపీ ఎంపిగా గెలిచారు.
గూడూరుకి బల్లి కళ్యాణ్ చక్రవర్తి..?
గూడూరు నియోజకవర్గం మొదటి నుండి బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి కంచుకోట లాంటిది. బల్లి దుర్గాప్రసాద్ తనయుడు కళ్యాణ్ చక్రవర్తికి రాబోయే ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకే తిరుపతి ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అంంటున్నారు. వరప్రసాద్ ను వేరే రిజర్వుడ్ నియోజకవర్గానికి పంపడమో లేక ఇతర సర్దుబాట్లు చేస్తారు. గుంటూరు జిల్లా తాడికొండలో ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. రాబోయే ఎన్నికలల్లో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన కుమార్తె ను తాడికొండ నుండి పోటీ చేయించాలని భావిస్తున్నారు. బాపట్ల ఎంపిగా ఉన్న నందిగం సురేష్ కూడా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆయన కూడా తాడికొండ ఆశిస్తున్నారని ఒక పుకారు ఉంది. గతంలో టీడీపీ హయాంలోనూ రిజర్వుడు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చారు ఇప్పుడు అదే విధంగా దాదాపు 20 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కఛ్చితంగా మార్పులు ఉంటాయని సమాచారం అందుతోంది.