YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఎన్నికల ఫలితాలు రికార్డుగానే చెప్పుకోవచ్చు. 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఘనత మొత్తం వైసీపీ అధినేత, సీఎం జగన్మోహనరెడ్డిదే అని చెప్పకతప్పదు. గెలిచిన 151 మందిలో కొద్ది మంది మాత్రమే వారి వ్యక్తిగత చరిష్మా తోడై ఎన్నికల్లో గెలిచారు కానీ ఎక్కువ శాతం మంది ఫ్యాన్ గాలిలోనే బయటపడారు అనేది వాస్తవం. జగన్ పాదయాత్ర, జగన్ ప్రచారం, జగన్ పై ఉన్న నమ్మకంతోనే జనాలు ఊహించని ఘన విజయాన్ని ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కాగా నెరవేరుస్తున్నారు.
YSRCP: అంతర్గత విభేధాలు, ఆధిపత్య పోరు
రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నవరత్న పథకాలను కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘన విజయాలను సొంతం చేసుకుంది వైసీపీ. అయితే జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాల అమలుపై చూపుతున్న శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టడం లేదన్న విమర్శ ఉంది. అయితే జగన్మోహనరెడ్డి సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాల వల్ల కొన్ని వర్గాలు వైసీపీకి దూరం అయ్యాయనీ, ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి. కొన్ని జాతీయ సర్వే సంస్థలు ఇటీవల నిర్వహించిన సర్వేలో వైసీపీకి 2019లో ఉన్న పరిస్థితి లేదని వెల్లడించాయట. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతల్లోనే అంతర్గత విభేధాలు, ఆధిపత్య పోరు. అక్రమ వ్యాపారాలు తదితర అంశాల కారణంగానూ పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని టాక్.
వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేలా..
అనేక రకాల కారణాలు, సర్వే రిపోర్టుల ఆధారంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్న నేపథ్యంలో తమకు మళ్లీ టికెట్ ఇస్తారా..? లేదా..? అనే భయం కొందరిలో నెలకొందట. అందుకే కొందరు తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేలా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారుట. ఒక వేళ టికెట్లు ఇవ్వకపోయినా రెబల్ గా గెలిచి తిరిగి పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తారనే ప్రచారం ఉంది.