YSRCP: రాబోయే అసెంబ్లీ ఎన్నికలు వైసీపీకి కీలకంగా మారుతున్నాయి. రాష్ట్రంలో మరో మారు కూడా అధికారాన్ని హస్తగతం చేసుకుని టీడీపీని అడ్రస్ లేకుండా చేయాలన్న పట్టుదలతో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నారు. ఆ లక్ష్యంతోనే జగన్ అడుగులు వేస్తున్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి అవుతుంది. ఇప్పటి వరకూ ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. ఇకపై రెండున్నరేళ్లు పార్టీ పైనా దృష్టి పెట్టే ఆలోచన చేస్తున్నారు వైఎస్ జగన్.
YSRCP: వైసీపీ ప్రచారంలో జగనే కీలకం
అయితే రాబోయే ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార బాధ్యతలను జగన్ ఒక్కరే చేపట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో జగన్ కు తోడుగా తల్లి వైెఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల ప్రచార బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలకు ముందే జగన్మోహనరెడ్డి దాదాపు నాలుగు వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసి ఉండటంతో ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో షర్మిల, విజయమ్మలు ప్రచారం నిర్వహించారు. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం, షర్మిలకు తోడు నీడగా ఆమె తల్లి వైెెఎస్ విజయమ్మ వ్యవహరిస్తూ ఉండటంతో రాబోయే ఎన్నికలలో ఏపి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో పర్యటించాల్సిన బాధ్యత జగన్ పైనే ఉంది. అయితే వైఎస్ జగన్ అధికారంలో ఉండటంతో ఈ సారి పాదయాత్ర చేయడం సాధ్యం కాదు. బస్సు యాత్ర వంటివి మాత్రమే చేయాల్సి ఉంటుంది. 175 నియోజకవర్గాలలో జగన్ ఒక్కరే ప్రచారం నిర్వహించడం కష్టమే అవుతుంది.
YSRCP: భారతికి తర్ఫీదు
ఈ నేపథ్యంలో ప్రచార పర్వంలో షర్మిల స్థానాన్ని భర్తీ చేయడానికి జగన్ తన సతీమణి భారతిని రాజకీయంగా ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ భారతి పారిశ్రామికవేతత్గా, గృహిణిగానే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆమె తాడేపల్లిలోనే ఉంటున్నా రాజకీయంగా క్రియాశీల బాధ్యతలు చేపట్టలేదు. అయితే భారతి గతంలో పులివెందులలో జగన్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం మాత్రం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించలేదు. అయితే ఈ సారి ప్రచారంలో భారతిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేలా జగన్ నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు భారతి ప్రచారం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. భారతి ఇంతకు ముందు వరకూ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించలేదు. రాబోయే ఎన్నికల సమయంలో ఆమెతో ప్రచారం చేయించేందుకు గానూ పబ్లిక్ స్పీచ్ పై భారతి శిక్షణ తీసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సో.. షర్మిల స్థానాన్ని భారతితో భర్తీ చేయనున్నారు అన్నమాట.