YSRCP: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్ధి గెలుపునకు తటస్థంగా ఉన్న వైసీపీ, బీజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీలే కీలకమన్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల మద్దతు ఇస్తే ఎన్డీఏ అభ్యర్ధి గెలుపు ఖాయం. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ ఏమిటి.. కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తుందా లేదా అన్నది క్లారిటీ లేదు. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ ఎంపీలు పేర్కొంటూ వచ్చారు. అయితే నిన్న అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YSRCP: ద్రౌపది ముర్మును కలిసి అభినందనలు తెలిపిన విజయసాయి
ఒడిషాకు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేడీ స్టాండ్ స్పష్టం అయ్యింది. స్వరాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్ము ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ది కావడంతో బీజేడీ మద్దతు ఖాయమైంది. ఇదే క్రమంలో ఏపీలోని వైసీపీ మద్దతుపైనా ఒక క్లారిటీ వచ్చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేడు ద్రౌపది ముర్మను కలిసి అభినందనలు తెలియజేశారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతోనే విజయసాయి రెడ్డి ఆమెను కలిసి ఉంటారు. సో..బీజేపీ ప్రకటించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధికి వైసీపీ మద్దతు ఖాయమైనట్లు దీన్ని బట్టి అర్ధం అవుతోంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిత్వం విషయంలో చత్తీస్ఘడ్ గవర్నర్ అనసూయ ఉయికీ పేరును బీజేపీ పరిశీలిస్తున్న సమయంలో మూడు రోజుల క్రితం విజయసాయిరెడ్డి చత్తీస్ఘడ్ వెళ్లి రాజ్భవన్ లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను అందజేసి వచ్చారు. దాంతోనే ఎన్డీఏ అభ్యర్ధికి వైసీపీ మద్దతు అని ఒక క్లారిటీ వచ్చేసినట్లు అయ్యింది.
YSRCP: వైసీపీ ఓటు విలువ 45,957
అయితే బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో మొత్తం 20 మంది పేర్లపై చర్చలు జరిపిన తరువాత తొలి సారిగా గిరిజన మహిళకు అవకాశం ఇవ్వాలని భావించి ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ద్రౌపది ముర్మును కలిసి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీకి 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు రాష్ట్రం నుండి మొత్తం 53,513 ఓట్ల విలువ ఉండగా, వైసీపీకి ఉన్న సంఖ్యాబలం కారణంగా 45,957 ఓట్ల బలం ఉంది.