YSRCP: శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఈ సారి ఎన్నికల్లో స్థానచలనం తప్పేలా లేదనే మాటలు వినబడుతున్నాయి. తమ్మినేని సీతారామ్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుండి ఆముదాలవలస నియోజకవర్గం నుండి ఆయన వివిధ పార్టీలను కలుపుకుని మొత్తం తొమ్మిది సార్లు పోటీ చేయగా, అయిదు సార్లు విజయం సాధించారు. ఆయన నాలుగు సార్లు టీడీపీ నుండి, ఒక సారి వైసీపీ నుండి గెలిచారు. టీడీపీ హయాంలో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన తర్వాత స్పీకర్ అయ్యారు. 1989 ఎన్నికలతో పాటు 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు టీడీపీ, పీఆర్పీ, వైఎస్ఆర్ పార్టీల నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టీడీపీ ఇన్ చార్జిగా ఉన్న కూన రవికుమార్ .. తమ్మినేనికి మేనల్లుడు, బావమరిది. కావడంతో ఇద్దరి మధ్య ఏమైనా అంతర్గత రాజకీయం ఉందని ఇద్దరికి ఉన్న కామన్ శత్రువులు ప్రచారం చేస్తున్నారు.
YSRCP: నియోజకవర్గంలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని..
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే .. 2019 ఎన్నికల సమయంలోనే టికెట్ రేసులో ఉన్న సువ్వారి గాంధీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అత్యంత ఓటు బ్యాంకు కల్గిన కళింగ సామాజిక వర్గానికి చెందిన సువ్వారి గాంధీ సతీమణి దివ్య అతి పెద్ద మండలానికి మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మండలం టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి కంచుకోటగా ఉండగా, మొట్టమొదటి సారిగా వైసీపీ ఖాతాలో వేసిన ఘనత ను గాంధీ సాధించారు. దీంతో పాదయాత్ర సమయంలోనే జగన్ కు సువ్వారి గాంధీకి ఇవ్వాలా లేదా తమ్మినేనికి ఇవ్వాలా అని ఆలోచించి వైసీపీకి కీలక సమయం కావడంతో రిస్క్ ఎందుకని అనుభవాన్ని ప్రాతిపదికన తీసుకుని తమ్మినేనికి అవకాశం ఇచ్చారు. అప్పుడే సువ్వారి గాంధీకి తర్వాత అవకాశం ఇస్తానని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. సువ్వారి అముదాలవలసతో పాటు ఇతర మండలాల్లో తన కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని ఓ పక్క పార్టీ, మరో పక్క సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముగ్గురు ఎన్ఆర్ఐ సోదరుల సహకారంతో సువ్వారి గాంధీ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు అండగా నిలుస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా తన ఇమేజ్ ను పెంచుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి హజరయ్యే కార్యక్రమాలకు సీఎంఓ కార్యాలయం నుండే పాల్గొనే వారి జాబితాలో గాంధీ పేరు వస్తొంది.
తన పట్టు చేజారకుండా రాజకీయ ఆధిపత్యం చెలాయించాలని
ఆముదాలవలస పట్టణం, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ మండల కేంద్రాల్లో ఆఫీసులను ఏర్పాటు చేసుకుని గాంధీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవిని ప్రభుత్వం ఆయనకు ఆఫర్ చేయగా దాన్ని ఆయన మరదలికి ఇప్పించుకున్నారు. మరో పక్క గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో ఈ నియోజకవర్గం వెనుకబడి ఉన్న జాబితాలో ఉండటం, నియోజకవర్గంలో బావ బావమరుదుల రాజకీయం తదితరాల నేపథ్యంలో పార్టీ గాంధీ అభ్యర్ధిత్వం వైపు మొగ్గుచూపుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల నర్సన్నపేటకు సీఎం జగన్ వచ్చిన సమయంలోనూ గాంధీకి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చారని కూడా ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలోని సమస్యలను సీఎం జగన్ దృష్టికి గాంధీ తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారని అంటున్నారు. ఇదే క్రమంలో ఆముదాలవలస నియోజకవర్గం మొదటి నుండి తనకు అండగా ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని వదులుకోవడానికి తమ్మినేని కూడా ఏ మాత్రం ఇష్టపడటం లేదు. తన పట్టు చేజారకుండా తన తర్వాత తన వారసుడే ఇక్కడ రాజకీయ ఆధిపత్యం చెలాయించాలని అని తమ్మినేని కోరిక. ఆందుకే ఆయనతో పాటు ఆయన కుమారుడు అప్పుడప్పుడు పార్టీ పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో. మరో వైపు తమ్మినేని వర్గం కూడా తమ్మినేనికి గానీ, ఆయన కుమారుడికి గానీ టికెట్ ఖచ్చితంగా వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.
గత ఎన్నికల్లో తమ్మినేని సీతారామ్ కు 13వేలకు పైగా మెజార్టీ రాగా ఆ తర్వాత జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీకి కేవలం ఏడువేల మెజార్టీ మాత్రమే రావడం ఈ నియోజకవర్గంలో ప్రధాన నాయకత్వం వైఫల్యమే కారణమని కొందరు ప్రచారం చేసుకున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో అముదాలవలస టికెట్ ను గాంధీకి కన్ఫర్మ్ చేసి సీనియర్ నాయకుడు అయినందున తమ్మినేని సీతారామ్ కు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ కన్వీనర్ గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు టెక్కలి అసెంబ్లీ ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించడంతో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి ప్రస్తుతం ఇన్ చార్జి ఎవరూ లేరు. ధర్మాన ప్రసాదరావు లేదా తమ్మినేని సీతారామ్ పేర్లను పార్లమెంట్ కు పరిశీలించే అవకాశం ఉందని పార్టీలో అంతర్గతంగా ఉన్న టాక్. ఈ నియోజకవర్గం విషయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహనరెడ్డి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి.
YSRCP: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్ కు చెప్పేసిన మరో సీనియర్ నేత