RRR: వైసీపీ రెబల్, ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ వేయాలని లోక్ సభ స్పీకర్ కు ఏడాదిన్నర క్రితమే వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ పెండింగ్ లోనే ఉన్న ఈ అంశం ఇప్పుడు కదిలింది. లోక్ సభ స్పీకర్ దీనిని ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. పార్టీ నేతలు, ప్రభుత్వంతోపాటు సీఎం జగన్ ను కూడా రఘురామ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీంతో పార్టీకి ఆయనకు దూరం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన అనర్హత పిటిషన్ ప్రివిలేజ్ కమిటీకి వెళ్లడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఫిబ్రవరి 5 లోపు తనపై అనర్హత వేటు వేయించాలని లేదంటే.. తానే రాజీనామా చేస్తానని ఆమధ్య వైసీపీ నేతలకు సవాల్ చేశారు రఘురామ. ఈ నేపథ్యంలో..
ఆయనలా బీజేపీలో చేరలేదు.. కానీ..
రఘురామపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినట్టుగానే.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శిశిర్ అధికారిపై కూడా ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేసారు. దీంతో స్పీకర్ వీరిద్దరిపై వచ్చిన పిటిషన్లను ప్రివిలేజ్ కమిటీకి పంపారు. శిశిర్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి బీజేపీలో చేరారు. ఇద్దరిదీ ఒకటే సమస్య కావడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. రఘురామపై ఏడాదిన్నరగా వైసీపీ ఎంపీలు పోరాడుతున్నారు. కానీ.. స్పీకర్ ఇంతవరకూ పంపించలేదు. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శిశిర్ అధికారి ఏకంగా బీజేపీలో చేరిపోయారు. రఘురామ బీజేపీలో చేరకున్నా బీజేపీ అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్నాయి. వీరిపై ప్రవిలేజ్ కమిటీకి పిటిషన్లు వెళ్లాయి కానీ.. అనర్హత వేటు పడుతుందా అనేదే ప్రశ్న.
రఘురామ నిర్ణయమేంటో..
అయితే.. ఇప్పటికే బీజేపీలో ఉన్న శిశిర్ అధికారిపై బీజేపీ నాయకులే ఉండే ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇచ్చినా.. స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశాలు తక్కువే. మరి.. రఘురామపై మాత్రం ఎలా వేయగలరు. రఘురామపై అనర్హత వేటు వేయాలంటే.. శిశిర్ ను పక్కన పెట్టాల్సిందే. ఇన్ని సానుకూలతల మధ్య రఘురామ అనర్హత అనేది దాదాపు అసాధ్యమే. విచారణ నివేదిక ఫిబ్రవరిలో ఏదొక సమయంలో రావొచ్చు. అయితే.. ఫిబ్రవరి 5వరకూ టైమ్ ఇచ్చిన రఘురామ.. తనపై అనర్హత పిటిషన్ నివేదిక వచ్చే వరకూ వేచి చూస్తారా..? ఫిబ్రవరి 5నే రాజీనామా చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది.