YSRCP ; ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితంపైనే కేంద్రీకృతం అయ్యింది. ఓ పక్క గుంటూరు, విజయవాడ కార్పోరేషన్ లపై చర్చ జరుగుతున్నప్పటికీ త్వరలో పరిపాలనా రాజధానిగా కాబోతున్న విశాఖపై రాజకీయంగా ఎక్కువ చర్చ జరుగుతోంది.
YSRCP : సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీచినా
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫ్యాన్ గాలి బలంగా వీచినప్పటికీ విశాఖపట్నంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవశం చేసుకుంది. అంతకు ముందు విశాఖ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పరాజయం పాలైయ్యారు. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఇతర ప్రాంతాల కంటే విశాఖలో వైసీపీ కంటే టీడీపీ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని సంకల్పించడంతో పాటు విశాఖపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా విశాఖను గెలుచుకోవాలన్న పట్టుదలతో అక్కడి బాధ్యతలను ప్రస్తుతం పార్టీలో ద్వితీయ పొజిషన్ లో ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అప్పగించారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మొత్తం 98 డివిజన్ లు ఉండగా కొన్ని డివిజన్లను అయినా ఏకగ్రీవం చేయాలని విజయసాయిరెడ్డి సర్వవిధాల ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులు డ్రాప్ (ఉపసంహరించుకుంటే) కోటి రూపాయల వరకూ ఆఫర్ లు ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రలోభాలకు అభ్యర్థులు లొంగకపోవడంతో పలు డివిజన్లలో బలమైన నాయకులను వైసీపీ వైపుకు తిప్పుకోవడంలో విజయసాయి రెడ్డి సక్సెస్ అయ్యారు. విశాఖ ఎన్నికల ఫలితం విజయసాయి రెడ్డి భుజస్కందాలపై ఉండటంతో ఇతర పార్టీల నేతలను చేర్చుకునే విషయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ను సైతం విజయసాయిరెడ్డి విభేదించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడిని చేర్చుకునే విషయంలో మంత్రి అవంతి అభ్యంతరం వ్యక్తం చేసినా వైసీపీలో చేర్చుకున్నారు.
ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత వైసీపీ పరిస్థితి కొంత మెరుగు అయిందని వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికలకు ముందే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రచ్చ నేపథ్యంలో అధికార వైసీపీ కూడా డ్రామాలు ఆడుతోందన్న భావన అక్కడి ప్రజానీకంలో వచ్చిందంటున్నారు. కార్మికుల ఉద్యమానికి వైసీపీ మద్దతు ఇస్తున్నా కేంద్రంపై గట్టిగా పోరాడం లేదన్న మాట వినిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిని కల్గిస్తోంది.
వివిధ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 98 డివిజన్ లకు గానూ 39 నుండి 44 వరకూ వైసీపీ, 26 నుండి 31 డివిజన్ లు టీడీపీ గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేన, వామపక్షాలు రెండేసి సీట్లు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. అయితే సుమారు 25 డివిజన్ లలో వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ 25 డివిజన్ లలో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక్కడి ఎన్నికల ఫలితాల ప్రభావం విజయసాయిరెడ్డిపై కశ్చితంగా ఉంటుందని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో విజయసాయిరెడ్డి పార్టీలో నెంబర్ 2 గా ఢిల్లీలో చక్రం తిప్పారు. వైసీపీ పార్లమెంట్ సభ్యులు అందరూ విజయసాయి రెడ్డి అండర్లోనే ఉండాలనీ, కేంద్ర మంత్రులను ఎవరిని కలవాలన్నా, పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్న విజయసాయి రెడ్డి కనుసన్నల్లో జరగాలని వార్తలు వచ్చాయి. ఆ తరువాత సీఎం జగన్ ఒకటి రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పిఎం మోడీ అపాయింట్మెంట్ లభించక వెనుతిరిగి వచ్చారు. వారి అపాయింట్మెంట్ ఖరారు చేయడంలో విజయసాయిరెడ్డి విఫలమయ్యారన్న వార్తల నేపథ్యంలో ఆయనకు జగన్ ప్రాధాన్యత తగ్గించారని ప్రచారం జరిగింది. ఆ తరువాత పరిస్థితులు చక్కబడటంతో విజయసాయిరెడ్డి కి పూర్తి స్థాయిలో విశాఖ బాధ్యతలను జగన్ అప్పగించారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసీపీ విశాఖలో గెలిస్తే విజయసాయి రెడ్డి ప్రాధాన్యత పార్టీలో సుస్థిరంగా ఉండిపోతుంది. ఒక వేళ ఏమైనా తేడా కొట్టి తక్కువ స్థానాలు వస్తే మాత్రం పార్టీలో ప్రాధాన్యత తగ్గడం ఖాయమని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది విజయసాయిరెడ్డి రాజకీయ భవితవ్యానికి పెద్ద పరీక్షగా మారింది.