YSRCP: రాజకీయంలో వేర్వేరు పార్టీల మధ్య ఆధిపత్య ధోరణి, ప్రాంతీయ నాయకుల మధ్య వైరం.. ఇవన్నీ సహజమే. కానీ.. అధికారంలో ఉన్న పార్టీ నేతల్లో.. అదీ ఒకే ప్రాంతానికి చెందిన నేతల మధ్య విబేధాలు, ఆధిపత్య హోరు మొదలైతే పార్టీకి తలనొప్పే. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం చాలా కష్టం. వారు చేసుకునే పరస్పర ఆరోపణలు పార్టీకి నష్టం కూడా చేస్తాయి. ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఇదే జరుగుతోంది. వారిద్దరూ అధికార పక్షానికి చెందిన వారే అయినా ఆధిపత్య హోరు నడుస్తోంది. దీంతో ఇద్దరి పంచాయతీ అధిష్టానానికి చేరింది. ఇద్దరికీ సామరస్యపూర్వకంగా చెప్పడమూ, హెచ్చరించడం కూడా జరిగిందని భోగట్టా. అయినా.. ఒకరిపై మరొకరు ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం వార్తల్లో నిలుస్తోంది.
ఒకరికి తెలీకుండా మరొకరు..
ఎంపీకి, ఎమ్మెల్యేకి మధ్య నువ్వా-నేనా అన్నట్టు వ్యవహారం కొనసాగుతోందని తెలుస్తోంది. వైరి వర్గాల్లోనూ అనుచరులు భారీగానే ఉన్నారు. ఇద్దరికీ అధినాయకుడి దగ్గర మంచి మార్కులే ఉన్నాయి. కానీ.. స్థానికంగా మాత్రం ఇద్దరూ కలిసి పని చేయడం లేదని తెలుస్తోంది. తన నియోజకవర్గంలోకి ఎంపీ రాకూడదనేంతగా వైరం పెరిగిపోయిందని అంటున్నారు. దీంతో ఒకరికి తెలీకుండా మరొకరు వారి వారి ప్రాంతాల్లో విషయాలు తెలిసేలా కొందరిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దీంతో వీరి వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారింది. క్షేత్రస్ధాయిలో పట్టు ఉండటం.. వైసీపీకి బలం, బలగం ఎక్కువగా ఉండటంతో గత ఎన్నికల్లో మంచి విజయాలే సాధించారు. కానీ.. ప్రస్తుతం వీరి వ్యవహారం నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
త్వరగా మేల్కోకుంటే..
ఇటువంటి పంచాయతీలు గతంలో టీడీపీ హయాంలో కూడా జరిగాయి. అయితే.. చంద్రబాబు నాయకుల మధ్య విబేధాలుంటే వెంటనే పరిష్కారం చూపేవారు. అప్పట్లో చిత్తూరు ఎంపీ వరప్రసాద్ ఏకంగా చంద్రబాబుపైనే విమర్శలు చేయడం వెంటనే పరిష్కరించడం జరిగాయి. కానీ.. ప్రస్తుతం వైసీపీలో వీరిద్దరి తీరు చాప కింద నీరులా మారుతోంది. ఆ ప్రాంతంలో బలంగా ఉన్న వైసీపీపై వీరి సమస్యల ప్రభావం పడకుండా, ప్రజల్లో చులకన కాకుండా చూడాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉంది. మరి.. పార్టీ వీరిద్దరి మధ్యా సయోధ్య ఎప్పటికి కుదిరేలా చేస్తుందో చూడాలి.