YSRCP : ఏపిలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సహజంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు కొంత మేర అనుకూలంగా ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ నేతను ఎన్నుకుంటే గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని, తమ ప్రాంతాల్లో పనులు సాఫీగా జరిగిపోతాయని సామాన్య ఓటర్లు భావిస్తుంటూ ఉంటారు. అందుకు అనుగుణంగానే ఓట్లు వేస్తుంటారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు అధికార పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించడం రివాజే. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల ఫిర్యాదులపై పూర్తి సాక్షాధారాలు ఉంటే తప్ప మామూలుగా అయితే పట్టించుకోరు. కానీ ప్రస్తుతం ఎపిలో రివర్స్ నడుస్తుంది. ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలు ఎటువంటి ఫిర్యాదుచేసినా వెంటనే ఎన్నికల సంఘం స్పందించే పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ఇదే ఇప్పుడు వైసీపీ టార్గెట్ కు తలనొప్పిగా మారుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై గంపెడాశలు పెట్టుకుంది. “గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బండి ముబ్బడిగా సంక్షేమ పథకాలు అమలు చేశాం. లబ్దిదారుల ఇళ్ల వద్దనే వాలంటీర్ల ద్వారా ఫించన్లు పంపిణీ చేస్తున్నాం, పాఠశాలకు పిల్లలను పంపే తల్లులకు ఏటా రూ.15వేలు వారి ఖాతాలో జమ చేస్తున్నాం, దాదాపు 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం” ఇలా ఎన్నో ప్రజలకు అవసరమైన పనులు చేసినందున మెజార్టీ గ్రామాల్లో ప్రజలు వైసీపీకి ఏకగ్రీవంగాా మద్దతు ఇస్తారనీ, ఒక వేళ పోటీ జరిగినా మెజార్టీ స్థానాలు వైసీపీ కైవశం చేసుకోవడం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 12వేల పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా సుమారు 8 వేల వరకూ పంచాయతీలు వైసీీపీ ఖాజాలో పడాలన్నది ఆ పార్టీ పెద్దల లక్ష్యంగా ఉంది. వీటిలో సుమారు రెండువేల పంచాయతీలు ఎకగ్రీవం అయితే మిగిలిన ఆరు వేల పంచాయతీలు పోటీ చేసి విజయం సాధించవచ్చన్నది వారి భావన.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య పెద్ద వైరం కొనసాగుతున్న నేపథ్యంలో ఏకగ్రీవాలపై వైసీపీ ఆశలు సన్నగిల్లుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏకగ్రీవాలు ఎక్కువగా జరగాలని ఆలోచనతో ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహాకాలను భారీగా పెంపు చేసింది. దీనిపై పత్రికల్లో ప్రకటన కూడా జారీ చేసింది. దీంతో అలర్ట్ అయిన టీడీపీ, ఇతర పార్టీలు అధికార పార్టీపై విమర్శలు లంకించుకుంది. బెదిరింపులు, దౌర్జన్యాలతో బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీ పూను కుంటోందనీ వీటిపై దృష్టి సారించాలంటూ ప్రతిపక్షాలు అటు గవర్నర్, ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాయి. అసలే ప్రభుత్వంపై కారాలు మీరాలు నూరుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కువ సంఖ్యలో జరిగే ఏకగ్రీవాలపై నిఘా పెడతామని చెప్పారు. ఈ ఎన్నికలను ప్రతిపక్ష టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తొలి విడత ఎన్నికల్లో పోటాపోటీగానే నామినేషన్ లు పడ్డాయి. నామినేషన్ల స్క్రూటినీ, ఉప సంహరణ తరువాత తొలి విడత ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.