Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై విస్తృత స్థాయి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు జరిగాయి. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, సీఎం ఆదేశిస్తే టీటీడీ ద్వారా మందు తయారు చేసి పంపిణీకి సిద్ధం అంటూ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వారం రోజుల క్రితం ప్రకటించారు. అయితే పరిశోధనల నివేదికలు ఆనందయ్య మందు ఆయుర్వేదం అని గానీ కరోనా కు పని చేస్తుంది అని గానీ దృవీకరించలేదు. దీంతో టీటీడీ మందు తయారీ, పంపిణీ విషయంలో పునరాలోచనలో పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి గ్రీన్ ఇచ్చిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆనందయ్య మందుపై ఆయుష్ సహా సీసీఆర్ఎఎస్ సంస్థలు నిర్వహించిన పరిశోధనల్లో కరోనా తగ్గుతుందని చెప్పలేదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆ మందు ఆయుర్వేదం కాదని పరిశోధనల్లో తేలినట్లు చెప్పారు. టీటీడీ ఆయుర్వేద కళాశాల నుండి కూడా ఆనందయ్య మందుపై పరిశోధనలు జరిగాయని అయితే ఆ మందులో ఎలాంటి హాని కారక పదార్ధాలు లేవని తేలిందన్నారు. ఆయుర్వేద శాఖ గుర్తింపు ఆనందయ్య మందుకు రాలేదని వైవీ వెల్లడించారు. ఆయుర్వేద శాఖ గుర్తింపు లేకుండా టీటీడీ ఆధ్వర్యంలో ఆయుర్వేద కళాశాలలో మందు తయారీ, పంపిణీ చేయడం సరైందని కాదని, ఆ కారణంగా టీటీడీ నుండి ఆనందయ్య మందు పంపిణీ చేయడం లేదని వైవీ స్పష్టం చేశారు.
Read More: Ts High court: రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..!!
అయితే ఆనందయ్య మందుకు ఆయుర్వేద శాఖ నుండి గుర్తింపు లభిస్తే టీటీడీ నుండి మందు తయారు చేసి పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని వైవీ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారు నేరుగా ఆనందయ్య మందు కోసం వెళ్లవద్దనీ, వారి సహచరులను, లేక బంధువులను పంపి తెప్పించుకోవాలని సూచించారు. కరోనాకు వైద్యులు ఇచ్చే మందుతో పాటు ఆనందయ్య మందును వాడవచ్చని వైవీ అన్నారు.