కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఇప్పుడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారతీయ జనతాపార్టీ మొత్తాన్ని ఏకధాటిగా నడిపిస్తూ అన్నీ రాష్ట్రాల్లోని రాజకీయ వ్యవహారాలను ముందుండి చూసుకునే ఈయన నిన్నటిదాకా చక్రం తిప్పారు. ఇప్పుడు జేపీ నడ్డా ను జాతీయ అధ్యక్షుడి హోదాలో కూర్చో పెట్టినా కూడా పార్టీ పై అతని ముద్ర మరియు పట్టు ఎక్కడికి పోలేదు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా మోడీ తర్వాత షా నే అందరూ చెబుతూ ఉంటారు. ఇక దగ్గర నుండి చూసినవారు అయితే ముందు అమిత్ షా ఆ తర్వాతే మోడీ అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాలనా వ్యవహారాల్లో మరియు నాయకుల మధ్య సమన్వయం తీసుకుని వచ్చేందుకు మోడీ.. షా పైన బాగా ఆధారపడుతూ ఉన్నాడు.
అయితే ఇవన్నీ పక్కనపెడితే ఈ మధ్యనే రెండోసారి జగన్ కి అమిత్ షా దగ్గర నుండి అవమానం జరిగింది. ముందు ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అతనిని రోజంతా వెయిట్ చేయించి ప్రస్తుతం ఖాళీ లేదు బిజీ షెడ్యూల్ అని వెనక్కి పంపిన ఆయన ఈసారి కూడా అలాగే చివరి నిమిషంలో అతనిఅపాయింట్మెంట్ ను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో జగన్ ను వెనక్కి పంపించినా అదే సమయంలో తెలంగాణా నుండి వచ్చిన అప్పటి ఎంపీ మరియు బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ కి అపాయింట్మెంట్ ఇచ్చి చాలాసేపు మాట్లాడారు. అప్పటి నుండి జగన్ ఢిల్లీ వెళ్లడం మానుకున్నారు కూడా. తాజాగా ఢిల్లీ టూర్ పెట్టుకొని అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయ్యాకే సిద్ధమవుతుండగా మళ్లీ క్యాన్సిల్ అయ్యిందని చావు కబురు చల్లగా చెప్పడం చాలా పెద్ద పరాభవమే.
అయితే బిజెపి పార్టీ వర్గాలు మాత్రం దీనివెనుక చాలా పెద్ద ఉద్దేశమే ఉందని అంటున్నారు. జగన్ విషయంలో అమిత్ షా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నారని వైసీపీ నేతలు అనుమానిస్తుండగా ఇప్పటికే శాసన మండలి రద్దు బిల్లు పార్లమెంట్ లో ఉంది. అంటే ఏపీలో మూడు రాజధానులు రావాలి అంటే కేంద్రం అనుమతి తప్పనిసరి కాబట్టి ప్రస్తుతానికి అమిత్ షా ఆడిందే ఆట పాడిందే పాట. అదీ కాకుండా కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఏదో పెద్ద ఉద్యమం మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తూ ఉండటం మరియు జగన్ ఇంకా కేసీఆర్ మంచి మిత్రులు కావడం కూడా బిజెపి పార్టీ వర్గాలకు పడని విషయం.
ఇదంతా పక్కన పెడితే తమ పార్టీ వారిని తప్పించి దేశంలోని మిగిలిన సీఎంలకు కేంద్రంలో ఇదే మర్యాద అవుతోం. అందుకే వారు బీజేపీకి వీలైనంత దూరంగా ఉంటున్నారు కానీ జగన్ మాత్రం చనువుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ తాను భంగపడుతూ ఏపీని కూడా భంగపరుస్తున్నారని అంటున్నారు. ఆయన వద్దకు నేరుగా వెళ్ళి జగన్ తనకు సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించమని కోరినపుడు షా ఏదో చేస్తారన్న నమ్మకం కల్గిందట. తీరా ఏపీకి వచ్చేసరికి షరా మామూలుగానే సీన్ ఉంది. ఒకసారి జగన్ సీబీఐ బోనులో సీఎం హోదాలో నిలబడి వచ్చారు కూడా. మొత్తం మీద చూసుకుంటే మోడీ వరకూ జగన్ తో సాన్నిహిత్యంగా ఉంటున్న అమిత్ షా మాత్రం ఎందుకో టార్గెట్ చేశారనే అంటున్నారు. మరి చూడాలి జగన్ వీటిని ఎలా నెగ్గుకువస్తారో.