చిరంజీవి రూటు మారుతోందా..తమ్ముడు కోసమా
సోము వీర్రాజుతో భేటీ వెనుక మతలబు ఏంటి…
రాజకీయాలకు పూర్తిగా దూరమైన మెగాస్టార్..కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సడన్ గా ఇప్పుడు పొలిటికల్ వార్తల్లో నిలిచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేరుగా చిరంజీవిని ఆకస్మికంగా కలవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు..ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం తరువాత ఆయన బీజేపీకి ఏనాడు దగ్గరగా లేరు. కేంద్ర మంత్రిగా పని చేసిన సమయంలోనూ..ఆ తరువాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత కాలం ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఏపీలో బలమైన నేత కోసం బీజేపీ అన్వేషించిన సమయంలో మోగాస్టార్ కు ఆహ్వానం అందినా..ఆయన తిరస్కరించారు. తాను సినిమాలకే పరిమిత మవుతానని చెప్పినట్లుగా ప్రచారం సాగింది. అయితే, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కలవటం మాత్రం అనేక చర్చలకు కారణమవుతోంది. సోదరుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తున్న జనసేన ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. పవన్ రాజకీయ జీవితం పైనా స్పందించటానికి చిరంజీవి పెద్దగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అటువంటిది ఇప్పుడు నేరుగా జనసేన మిత్రపక్షం అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలవటం హాట్ టాపిక్ మారింది.
తమ్ముడితో కలిసి అధికారంలోకి రావాలంటూ…
బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఎపి బిజెపి అధ్యక్షులు గా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కు అభినందనలు తెలిపిందుకే చిరంజీవి భేటీ పరిమితం అయిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సోము వీర్రాజును చిరంజీవి పుష్పమాల, శాలువాతో సత్కరించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని సూచన చేసారని చెబుతున్నారు. 2024 లో బిజెపి, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని ఆకాంక్షించారని ఆయన సన్నిహితులు చెబుతున్న సమచారం. అయితే, ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్న ఎన్నికల గురించి ఇప్పుడు చిరంజీవి వద్దకు వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కలవటం నిజంగా మర్యాద పూర్వకమేనా..లేక ఏదైనా పొలిటికల్ టర్నింగ్ ఉందా అనే చర్చ సాగుతోంది. జనసేనలో ఇప్పటికే పవన్ తో కలిసి నాగబాబు ముందుకు సాగుతున్నారు. కానీ, మెగా ఫ్యామిలీ నుండి మరెవరూ జనసేనకు నేరుగా మద్దతు ప్రకటించిన సందర్భాలు లేవు. చిరంజీవి సైతం ఎన్నికల ప్రచారంలో జనసేనకు ఏ విధంగానూ సాయం అందించలేదు. ఇప్పుడు జనసేన మిత్రపక్షం అందునా..కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి మిత్రపక్ష పార్టీ అధినేత సోదరుడు అయిన చిరంజీవిని కలవటం కాకతాళీయం కాదనే చర్చ మొదలైంది.
జగన్ తోనూ సఖ్యతతో ముందుకు..
చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తోనూ సఖ్యత కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ నాడు కలవని చిరంజీవి..తన సైరా సినిమాకు ఏపీలో ప్రత్యేక అనుమతులు ఇవ్వటం పైన సీఎం జగన్ కు ధన్యావాదాలు తెలిపారు, జగన్ ఆహ్వానం మేరకు సీఎం నివాసానికి సతీ సమేతంగా వెళ్లి విందుకు హాజరయ్యారు. ఆ సమయంలో ఏపీ లో సినీ పరిశ్రమ డెవలప్ మెంట్ గురించి చర్చలు జరగ్గా.. దీనికి నాయకత్వ బాధ్యతలు తీసుకొని సమస్యలు ఏంటో వివరించాలని…తప్పకుండా పరిష్కరిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలతో కలిసి కరోనా సమయంలో మరోసారి సినీ పరిశ్రమ సమస్యలను చిరంజీవి నేరుగా ముఖ్యమంత్రికి వివరించారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి సమయంలో ఇప్పుడు ఆకస్మికంగా బీజేపీ ముఖ్య నేత వచ్చి కలవటం పైనా చిరంజీవి తిరిగి రాజకీయంగా ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా..అందులో భాగంగా ఇది తొలి అడుగా అనే సందేహం వ్యక్తం అవుతోంది.అయితే, ప్రజారాజ్యంలో కలిసి పని చేసిన మెగా సోదరులు..జనసేనలో మాత్రం కలవ లేకపోతున్నారు. మరి..రానున్న రోజుల్లో ఇప్పుడు చిరంజీవి..సోము వీర్రాజు భేటీ ఎటువంటి సమీకరణాలకు వేదిక అవుతుందో చూడాలి.