Lockdown : సరిగ్గా ఏడాది క్రితం భారతదేశం తొలిసారి కోవిడ్ ఉనికిని చవిచూసింది. అప్పటి నుండి ఈ రోజు వరకు దాని ప్రభావం అందరి పై పడింది. ఒక మూడు నెలల నుండి కొద్దిగా ఉపశమనం లభించగానే మళ్లీ మార్చి నెల వచ్చేసరికి పరిస్థితి మునుపటి మార్చి లాగే తయారవుతోంది.
కరోనా నింపిన చీకటి… ఇచ్చిన తెలివి
కరోనా మహమ్మారికి చెక్ చెప్పడానికి లాక్ డౌన్ ను మించి వేరే మార్గం లేదని కేంద్రం గత సంవత్సరం మార్చి 23 వ తేదీన ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు ఒక రోజు ముందే సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. అప్పుడు మొదలైన వైరస్ ప్రభావం భారత్ పై పెను ప్రభావం చూపింది. ఎన్నో జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయి. రోడ్డు పై పడిన వలస కార్మికులు…. కుటుంబాలకు ఈ లోకాలకి దూరమైన ఎంతో మంది పోలీసులు, డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్… పూర్తిగా చీకటి నిండిన బడుగు బలహీన జీవుల ఇళ్ళు…. ఇలా లాక్ డౌన్ అందరికీ జీవితంలో మర్చిపోలేని ఎన్నో పాఠాలు నేర్పింది. ఎవరైనా ప్రకృతి ముందు ఒకటే అని చాటి చెప్పింది.
Lockdown : అప్పుడెలా?
ఇక లాక్డౌన్ ముందు దేశంలో కరోనా వైరస్ పునరుత్పత్తి 1.7 గా ఉంటే లాక్ డౌన్ తర్వాత 1.2 కి తగ్గింది. మార్చిలో మొదలైన కేసులు పరంపర ఆగస్టు నాటికి తీవ్ర స్థాయికి చేరుకొని నవంబర్–డిసెంబర్ కి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అయితే ఆ మధ్యలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దేశ ఆర్థికవ్యవస్థ దాదాపు పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటిదేమీ లేదని కేంద్రం బుకాయిస్తున్నప్పటికీ ఆర్థిక శాస్త్రవేత్తలు మాత్రం ఖచ్చితమైన లెక్కలు చెబుతున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు కేవలం శాంపిల్. లోలోపలి నష్టం అంచనా వేయడానికి మన శక్తి సరిపోదు అని చెప్పాలి.
ఇప్పుడిలా….
ఇక సరిగ్గా ఏడాది దాటిన తర్వాత దేశంలో మళ్లీ కరోనా ఊపందుకుంది. కేరళ, మహారాష్ట్ర లో భారీ స్థాయిలో కేసులు నమోదు అవుతుంటే వారు లాక్ డౌన్ ను విధించారు. స్కూలు. హాస్టళ్ళ మూసివేత పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఇక తెలంగాణలో కూడా వీకెండ్స్ కంప్లీట్ లాక్ డౌన్ వేసే దిశగా కేసీఆర్ ఆలోచిన్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇలా వీకెండ్ లాక్ డౌన్ విధించగా మరికొన్ని చోట్ల కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. అయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ సాధ్యపడకపోవచ్చు కానీ మళ్ళీ మార్చి నెల నుండి ప్రజలకు గడ్డుకాలం మొదలుకానుంది అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.