హోరాహోరీగా, జరుగుతున్న ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఎన్నికలలో తలపడుతున్న నాయకులు తమ రాజకీయ ప్రచార పదకోశం నుండి పూర్తిగా తొలగించిన పదాలు ఈ ప్రచారం రూపు రేఖలని తెలియచేస్తున్నాయి. మీకు నచ్చిన పదాలను మీరు ఎంచుకోండి. నాకు మాత్రం బిజెపి ప్రచారం నుండి మాయమయిన అచ్చే దిన్ పదం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రచారం నుండి మాయమాయ్యిన లౌకికవాదం పదం చాలా ముఖ్యంగా తోస్తున్నాయి.
2014 ఎన్నికలలో బిజెపి ప్రచార పదం అయిన అచ్చే దిన్ ఈ సారి ప్రమాదవశాత్తు కూడా నరేంద్ర మోదీ నోటి నుండి కానీ అమిత్ షా నోటి నుండి కానీ రాలేదు. కనీస స్థాయి జవాబుదారీతనం ఉండి ఉంటే ఏమి అచ్చే దిన్ వారు తీసుకొచ్చారో చెప్పే ప్రయత్నం చేసేవారు.
అయితే, దొంగ లెక్కలని నమ్మేవారు తక్కువగా ఉంటారు. తమ గురించి తాము ప్రచారం చేసుకోవటానికి నాలుగు వేల కోట్లు ఖర్చుపెట్టిన మోదీ ప్రభుత్వం తాము అమలు చేసిన పధకాల వైఫల్యాలని కప్పిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నది. జన ధన యోజన నే తీసుకోండి. ఈ సంవత్సరం మార్చి నాటికి ఆ పధకం వెబ్ సైట్ ప్రకారం 34.87 కోట్ల ఖాతాలలో 93,567 కోట్ల రూపాయల డిపాజిట్ ఉంది. అంటే తలసరి ఖాతాలో ఉన్నది కేవలం 2, 683 రూపాయలు. దీనిని చూపించి వోట్లు ఏమి అడగగలరు? పైగా ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన జుమ్లా కి ఇది ఒక చేదు గుర్తుగా ఉంటుంది.
అందరికీ గ్యాస్ కనెక్షన్ అని తెగ బాకా ఊదిన ఉజ్వల పధకాన్ని తీసుకుందాం. పేద మహిళలకి ముప్పై నాలుగు కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెగ ఊదరగొడుతున్నారు. కానీ నిజం ఏమిటో ఈ కనెక్షన్లు లభించిన మహిళలకి తెలుసు. ఇందులో వాళ్ళు ఉచితంగా ఇచ్చింది ఏమి లేదు. ప్రతి గ్యాస్ కనెక్షన్కి వాయిదాలలో 1, 600 రూపాయలు కట్టాలి. ఈ విధంగా ఈ సంవత్సరం జనవరి వరకు 9,968 కోట్లు ప్రభుత్వానికి అందాయి. అంతే కాక 13 లక్షల గ్యాస్ కనెక్షన్లకి ఉన్న రాయితీని తొలగించడంతో ప్రభుత్వానికి ఆదా అయ్యిన 3, 690 కోట్లని కలిపితే ప్రభుత్వం ఆర్జించిన మొత్తం 13, 658 కోట్ల రూపాయలు. ఇది ఈ పధకం అమలుకి అయ్యే ఖర్చులో 68%. ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండర్ల ధర అమాంతం పెరిగిపోయింది. మోదీ అధికారం చేపట్టేనాటికి 392 రూపాయలు ఉన్న సిలిండర్ ధర నేడు 800 రూపాయల పైచిలుకే ఉంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఈ ధరలో చాలా చిన్న భాగం. అంటే దీనర్థం పేద మహిళల ఇళ్ళల్లో గ్యాస్ స్టవులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈనాటికీ వారు కాలుష్య కారకమైన వంట చెరుకునే వాడుతున్నారు.
మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంకో పధకం ముద్రా. ఈ పధకం కింద ఇచ్చిన రుణం తలసరికి 46,000 రూపాయలు మాత్రమే. ఇది ఇంకొక భారీ నిరర్ధక ఆస్తుల కుంభకోణానికి దారి తెస్తుందని బ్యాంకు అధికారులు ఒక పక్క హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ రుణాలు ఆదాయాన్ని కానీ జీవనోపాధిని కానీ పెంచాయి అని చెప్పే ఎటువంటి రికార్డు కానీ, పర్యవేక్షణ కానీ లేదు. మిగతా పధకాలది కూడా ఇదే కథ.
ఈ ఐదు సంవత్సరాలలో స్పష్టంగా తేలింది ఏమిటంటే నిరుద్యోగం పెరుగుదల గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఉందన్న విషయం. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాము అన్న వాగ్ధానం సంగతి అటుంచితే, నోట్ల రద్దు తరువాత 1.1 కోట్ల ఉద్యోగాలు మాత్రం పోయాయి.
సగటు వ్యవసాయ ఆదాయం ఇంత తక్కువ గత పద్నాలుగు సంవత్సరాలలో ఎప్పుడూ లేదు. మోదీ అధికారం చేపట్టిన మొదటి మూడు సంవత్సరాలలో రైతుల ఆత్మహత్యలు 42 శాతం పెరిగి 48,000కి చేరుకున్నాయి. దాని తరువాత రైతు ఆత్మహత్యల గణాంకాలు ప్రచురించటమే ఆపేశారు.
సగటు గ్రామీణ వేతనం తగ్గింది లేదా అంతే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సరిపడినన్ని నిధులు కేటాయించని కారణాన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం కింద సగటు పని రోజులు తగ్గిపోయాయి. 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో దొరుకుతున్న కనీస కూలీ కన్నా తక్కువగా ఈ పధకం కింద రోజువారీ కూలీ చెల్లిస్తున్నారు.
ఈ ఐదు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం అందించే వితంతు పింఛను ఒక్క రూపాయి కూడా పెంచింది లేదు.
దేశంలో ఆర్ధిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈనాడు 73% శాతం దేశ సంపద ఒక శాతం పెట్టుబడిదారుల చేతుల్లో పోగుపడి ఉంది.
తాము వాగ్ధానం చేసిన అచ్చే దిన్ ఏమయ్యాయో చెప్పకుండా, చేసిన వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎందుకు నెరవేర్చలేకపోయారో చెప్పకుండా పాలకపార్టీ పెద్దలు ఒక బూటకపు జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల మీద దుష్ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా తమను ఎవరు వ్యతిరేకించినా వారిని హిందూ వ్యతిరేకులుగా, పాకిస్థాన్ మద్దతుదారులుగా, దేశద్రోహులుగా నిందిస్తున్నారు. ఉగ్రవాదం కేసులో నిందితురాలు అయిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ని బిజెపి తరుపున ఎన్నికలలో నిలబెట్టడం వారి విష ప్రచారానికి ఒక సూచిక. ఈ విష ప్రచారం సమాజంలో మానని గాయాలకి కారణం అవుతున్నది. రేపు వీరు ఓడిపోయినా-వారు ఓడిపోతారు అనే అనుకుంటున్నాను- ఈ గాయాలు మానవు.
ఒకపక్క బిజెపి బహిరంగంగా విద్వేషపూరిత ప్రచారం చేస్తుంటే, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఈ దేశపు మౌలిక సూత్రమైన లోకికవాదాన్ని ఎన్నికల ప్రచారంలో సమర్ధించడానికి ప్రయత్నించలేదు. ఆ పార్టీ ప్రచారంలో ఈ పదమే లేదు. కాంగ్రెస్ నాయకులు ప్రేమ వర్సెస్ ద్వేషం, కౌగిలింతలు వర్సెస్ పిడిగుద్దులు లాంటివి మాట్లాడుతున్నారు కానీ ఒక్కటంటే ఒక్క ప్రచార సభలో కూడా లోకికవాదం అనే పదమే ఉచ్ఛరించలేదు. లౌకికవాదం ఈ దేశంలోని అన్ని సమస్యలకి మూలం అని నాలుగు సంవత్సరాల క్రితం పార్లమెంట్ లో సాక్షాత్తు ఈ దేశపు హోంమంత్రి ప్రకటించారు. అటువంటి రాజ్యంగావిరుద్ధమైన మాటలకి అందరి కన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చెందినట్టు ఉంది.
ప్రధాన ప్రతిపక్షం లౌకికవాదం గురించి ఎందుకు మాట్లాడటం మానేసింది? లౌకికవాదానికి అనేక కోణాలు ఉన్నాయి. రాజ్యానికి ఎటువంటి మత ఆస్థిత్వం ఉండకూడదు, మతం, రాజకీయాలు రెండు తప్పనిసరిగా వేరు వేరుగా ఉండాలి అనేది లౌకికవాదం ప్రధాన సూత్రం. బాబ్రీ మసీదు కూల్చివేసిన రెండు సంవత్సరాలకి ఇచ్చిన బొమ్మై కేసు తీర్పులో లౌకికవాదం అనేది సవరించటానికి వీలు లేని రాజ్యాంగం మౌలిక నిర్మాణంలో భాగమని చెబుతూ సుప్రీం కోర్టు ఈ విధంగా పేర్కొంది: “ రాజ్యాధికారాన్ని, మతాన్ని కలగలపటాన్ని రాజ్యాంగం గుర్తించదు, ఆమోదించదు. రెండిటిని వేరు వేరుగా ఉంచాలి. ఇది రాజ్యంగ ఆదేశం. ఈ దేశం రాజ్యంగబద్ద దేశంగా ఉన్నత కాలం ఎవరూ కూడా ఇంకో విధంగా చెప్పటానికి వీలు లేదు. రాజకీయాలను, మతాన్ని కలపగూడదు.”
రాజకీయాలని, మతాన్ని కలపగూడదు. కానీ కాంగ్రెస్ చేస్తున్నది పూర్తిగా అదే. కాకపోతే కాంగ్రెస్ చేసేది సాఫ్ట్ వెర్షన్. ఎన్నికల సమయంలో గుడులు, గోపురాలు సందర్శించి వాటి ఫోటోలని ప్రచారం చెయ్యడం, మైనారిటీలను కాంగ్రెస్ బుజ్జగిస్తుంది అనే బిజెపి సంధించే అపవాదు నుండి బయటపడటానికి మత చిహ్నాలని విరివిరిగా వాడటం, ఈ దేవుడికో ఆ దేవతకో భక్తుడిని అని ప్రకటించడం, మత విశ్వాసం పేరు మీద సామాజిక సంస్కరణలకి తిలోదకాలు ఇవ్వడం, గోరక్షణ పేరు మీద అమాయకులని చంపుతుంటే నిశబ్దంగా ఉండటం, ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా అనంతం. ప్రస్తుతం “హిజ్ మాస్టర్స్ వాయిస్”గా వ్యవహరిస్తున్న అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ వారిని ఎద్దేవా చేస్తూ ఒక మత అస్థిత్వాన్ని నిలబెట్టడంలో బిజెపి పూర్తిగా సఫలం అయ్యిందని ప్రకటించడంలో వితేముంది?
బిజెపి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే జరగబోయే వినాశనం నుండి కాపాడటానికి చెయ్యవలసిన యుద్ధంలో లౌకికవాదం, లౌకికవాద విలువలు గుండెకాయ లాంటివి.
ఎన్నికల ప్రచారంలో “మాయమయిన పదాల” కథ ప్రత్యామ్నాయ విధానం, రాజకీయాలు, దార్శనికత అవసరాన్ని నొక్కి చెబుతున్నది. ఈ దార్శనికత రాజ్యాంగం మౌలిక నిర్మాణాన్ని ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా కాపాడేదిగా, మాటల్లోనూ, చేతల్లోనూ మార్పుకి నాంది పలికేదిగా, సంస్కరణల పేరుతో దేశంలో అసహ్యకరమైన రీతిలో సామాజిక, ఆర్ధిక అసమానతలకి కారణం అయిన ఆర్ధిక విధానాలని తిరగరాసే విధంగా ఉండాలి. అప్పుడే భారతదేశానికి అచ్చే దిన్ మొదలవుతాయి.
-బృందా కారత్
వ్యాసకర్త సిపిఐ (ఎమ్) పోలిట్బ్యూరో సభ్యురాలు
ఎన్డి టివి సౌజన్యంతో