Amaravati Capitals: ఏపీలో రాజధానుల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఈరోజు పెద్ద ట్విస్టు ఇచ్చింది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్దీఏ రద్దు బిల్లులను వెనక్కు తీసుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఈరోజు హైకోర్టుకి తెలియజేసారు.. మరోవైపు మంత్రి వర్గం కూడా సమావేశమైంది. దీంతో రాజధానుల విషయంలో ఏదో కొత్త ప్రణాళిక ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి స్పష్టత ఏమి రానప్పటికీ… మూడు రకాల ప్రతిపాదనలు మాత్రం సిద్ధమైనట్టు తెలుస్తుంది. లోతుగా అధ్యయనం, బాగా చర్చలు, న్యాయ చిక్కులన్నిట్నీ సమీక్షించుకుని వీటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయనున్నట్టు సమాచారం…
ముందుగా ఈ బిల్లుని ఎందుకు వెనక్కు తీసుకుంటున్నారనేది పరిశీలిస్తే… “ఈ బిల్లులో చట్టబద్ధత లేదన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. న్యాయపరమైన చిక్కులు రానున్నట్టు ప్రభుత్వానికి తెలుసు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరంగా ఆమోదించేసారు. శాసనసభలో ఆమోదం తర్వాత శాసనమండలిలో ఆమోదించలేదు.. సెలెక్ట్ కమిటీకి పంపించారు. దీంతో మండలిలో చిక్కులు దాటకుండానే బిల్లుని మళ్ళీ ప్రభుత్వం నేరుగా గవర్నర్ కి పంపించింది. ఆయన ఆమోదించారు. ఇది జరిగి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. అందుకే బిల్లులో చట్టబద్ధత లేదంటూ ప్రతిపక్షాలు, అమరావతి జేఏసీ సభ్యులు, అమరావతి రైతులు కోర్టుకి వెళ్లారు…” ఇవన్నీ చూసిన ప్రభుత్వం ఈ బిల్లులకు న్యాయపరమైన చిక్కులు తప్పవని అర్ధం చేసుకుని ఈరోజు వెనక్కు తీసుకుంది. ఇక వీటిపై కొత్తగా మూడు రకాల ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది.. ముఖ్యంగా న్యాయపరంగా ఎటువంటి చిక్కులు రాకుండా.. వెనకడుగు వేశారనిపించుకోకుండా.. మధ్యస్థంగా ఉండేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది..!
Amaravati Capitals: ఆప్షన్ నంబర్ వన్..!
రెండు రాజధానులు.. ఏపీలో మూడు రాజధానులంటే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కర్నూలులో న్యాయరాజధానికి కొన్ని న్యాయపరమైన చిక్కులు తప్పవు. కోర్టుల అంగీకారం ఉండాలి. ఏ సమయంలో అయినా కేంద్ర హోమ్ శాఖ నుండి కూడా కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే కర్నూలు న్యాయరాజధాని ప్రతిపాదనని వెనక్కు తీసుకుని… న్యాయ, శాసన రాజధానిగా అమరావతిని కొనసాగించి.. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉంచేలా ఆలోచిస్తున్నారు. ఇది జరిగితే అమరావతికి కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. విశాఖని పరిపాలన రాజధానిగా ఉంచినట్టు ఉంటుంది. ఇది జరిగితే రాయలసీమ ప్రాధాన్యత తగ్గించినట్టు ఉంటుంది.. అందుకే అక్కడ జనం హర్ట్ అవ్వకుండా ఉండేలా “రాయలసీమ అభివృద్ధి కార్పొరేషన్” ఒకటి ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.
ఆప్షన్ రెండు..!
మూడు రాజధానులు.. రాజధానుల ప్రతిపాదనల్లో ఎటువంటి మార్పులు ఏమి లేకుండా.., ఫ్రెష్ గా మూడు రాజధానుల బిల్లుని శాసనసభలో, శాసనమండలిలో ఆమోదించే యోచనలో ప్రభుత్వం ఉంది. గతంలో ఆమోదించిన బిల్లుల్లో న్యాయపరమైన చిక్కులున్నాయి. శాసనమండలిలో ఆమోదించలేదు. అందుకే ఈ సారి మండలిలో కూడా వైసీపీకి బలం పెరిగింది కాబట్టి… శాసనసభ, శాసనమండలిలో ఒకేసారో ఆమోదించి, ఫ్రెష్ గా గవర్నర్ కి పంపించే ఆలోచనలో ఉన్నారు. అయితే న్యాయ రాజధానిని అమరావతికి.. శాసనరాజధానిని కర్నూలుకి మార్పులు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే న్యాయపరమైన చిక్కులు అధిగమించినట్టు ఉంటుంది. సభ, మండలి, గవర్నర్ మూడు దశలను దాటినట్టు ఉంటుంది.. అందుకే ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు సమాచారం..!
ఆప్షన్ మూడు..!
ఒకటే రాజధాని..! ఇక మూడో ప్రతిపాదనగా… ఇప్పుడున్న అమరావతిని రాజధానిగా కొనసాగించి.. రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రాంతాలను అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరణ పేరుతో… రాజధాని ఇక్కడ ఉంటూనే.., అభివృద్ధి చేయడానికి ఆయా కార్పొరేషన్లు ద్వారా చర్యలు తీసుకోనున్నారు.. ఇక్కడ మూడు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ… రెండో ప్రతిపాధనకే ఎక్కువ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తుంది.