Paritala Sriram: రాష్ట్ర రాజకీయాల్లో అనంతపురం జిల్లాకు ఓ చరిత్ర ఉంది. ఈ జిల్లా విస్తీర్ణపరంగా పెద్దది. 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లా నుండి అనేక మంది నేతలు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. జేసీ, పరిటాల తదితర కుటుంబాలు ఉన్నాయి. పరిటాల కుటుంబం అంటే టీడీపీ, టీడీపీ అంటే పరిటాల కుటుంబం అన్న పేరు ఉంది. ఇప్పుడు జేసీ కుటుంబం కూడా టీడీపీకి అంతే కంకణబద్దులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు పరిటాల కుటుంబానికి సీట్ల కేటాయింపు అంశం పెద్ద సమస్యగా మారింది. పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా ఉండగా, పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత బీజేపిలోకి వెళ్లిపోయారు. ఆయన బీజేపీలోకి వెళ్లినప్పటికీ ఆయన సన్నిహితులు, బంధువులు ఎక్కువ మంది టీడీపీలో ఉన్నారు.
Paritala Sriram: సూరి కార్యాలయ ప్రారంభోత్సవంలో టీడీపీ నేతలు
సూరి బీజేపీకి వెళ్లడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరం పార్టీ ఇన్ చార్జి బాధ్యతలను పరిటాల శ్రీరామ్ కు అప్పగించారు. 2024 ఎన్నికల్లో ధర్మవరం నుండి పోటీ చేయడానికి శ్రీరామ్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటుండగా, బీజేపీకి వెళ్లిన సూర్యనారాయణ మళ్లీ టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారికంగా ఆయన ఇంకా టీడీపీలో చేరలేదు కానీ ధర్మవరంలో ఇటీవల తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయనకు పరిచయం ఉన్న టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకులు హజరైయ్యారు. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యేలు జేసి ప్రభాకరరెడ్డి, చింతమనేని ప్రభాకర్ సహా సూరికి వ్యక్తిగత పరిచయం ఉన్న పలువురు సీనియర్ టీడీపీ నేతలు హజరైయ్యారు. వరదాపురం సూరి కార్యాలయాన్ని ప్రారంభించడం, దానికి టీడీపీ నేతలు హజరుకావడంతో ధర్మవరం టీడీపీ సీటు విషయంలో ఏదో జరగబోతున్నది అన్న టాక్ బయలుదేరింది.
పోటీ చేస్తే దర్మవరం నుండే లేకుంటే రాజకీయాలకు దూరమే
పరిటాల శ్రీరామ్ వర్గం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ధర్మవరం సీటు పరిటాల శ్రీరామ్ కే అన్న నమ్మకంతో ఆ వర్గం ఉంది. పార్టీ నుండి వెళ్లిపోయిన వరదాపురం సూరి మళ్లీ టీడీపీలోకి రావాలని ప్రయత్నించడం, ఆయనకు టీడీపీలోని నేతలు మద్దతు పలకడం, పార్టీ అధిష్టానం కూడా వరదాపురం సూరిని పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగా ఉండటం పరిటాల శ్రీరామ్ వర్గానికి నచ్చడం లేదు. ధర్మవరం సీటు విషయంలో వెనక్కుతగ్గే ప్రసక్తేలేదని పరిటాల శ్రీరామ్ గతంలోనే చెప్పారు. ధర్మవరం సీటు ఇవ్వకపోతే తాను రాజకీయాల నుండి కూడా తప్పుకుంటానని సీరియస్ గా చెప్పారు. తాజాగా సూరి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత కూడా పరిటాల శ్రీరామ్ తన స్టాండ్ ను మీడియా ముందు పునరుద్ఘాటించారు. ధర్మవరం నుండి తానే పోటీ చేస్తాననీ, ఒక వేళ కుదరకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరం విషయాన్ని ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.