రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్- పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం- పార్లమెంట్ లో ఆమోదం పొందిన రోజున పార్టీ వ్యవస్థ సమగ్రతను, స్థిరత్వాన్ని కాపాడతామని రాజకీయ పార్టీలు ఒక వాగ్దానం చేశాయి. రాజ్యాంగంలో పదవ షెడ్యూల్ని చేర్చటానికి ఉద్దేశించిన 52వ రాజ్యాంగ సవరణ బిల్లుకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించటం ద్వారా తమ నిబద్ధతని చాటిచెప్పాయి.
ముప్పై నాలుగు సంవత్సరాల తరువాత ఆ నిబద్ధతకి ఎటువంటి విలువా లేదనిపిస్తుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు మారటంలో తనమునకలై ఉన్నారు. పూర్తిగా చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ నుండి తండోపతండాలుగా గెలిచిన పార్టీలలోకి మారటం చూస్తుంటే పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం అంటే వారికి ఏ మాత్రం గౌరవం లేదనేది స్పష్టమవుతోంది.
ఇంతకుముందు “ ఆయా రాం, గయా రాం” వ్యవహారం ఆందోళనకరమైన స్థాయిలో రాజకీయ అనిశ్చితికి తెర లేపింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ ‘స్వేచ్ఛగా తిరిగేందుకు తమకున్న హక్కు’ని కాస్త ఎక్కువగా వాడుకోవడంతో ప్రభుత్వాలు తరుచుగా కూలిపోయాయి.
ఇప్పుడు ఇంకొక వ్యవహారం నడుస్తున్నది. ఓడిపోయిన పార్టీకి చెందిన శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో గెలిచిన పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు. దీని కారణంగా ఓడిపోయిన పార్టీకి చట్ట సభలలో ఏమాత్రం ప్రాతినిధ్యం ఉండటం లేదు. గెలిచిన పార్టీలకు చెందిన అగ్రశ్రేణి నాయకులు బహిరంగంగానే ఈ ఫిరాయింపులని ప్రోత్సహిస్తున్నారు.
ఫిరాయింపు అనేది రాజకీయంగా అనైతికమైనది. ఫిరాయింపు నిరోధక చట్టం దీనిని నిర్మూలించి ఉండాల్సింది. ఒక పార్టీకి చెందిన ప్రతినిధిని ప్రజలు ఎన్నుకుంటే ఆ అభ్యర్ధికి ఇంకొక పార్టీకి ఫిరాయించే నైతిక హక్కు కానీ, చట్టరీత్యా హక్కు కానీ లేదు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం అటువంటి వారు తమ పదవి కోల్పోతారు. అయినా కూడా ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. గుంపులుగుంపులుగా ఫిరాయిస్తూ చట్టం నుండి తప్పించుకుంటున్నారు. ఇది ఒకరకంగా చట్టానికి ఓటమి లాంటిది.
ఈ పరంపరలో తాజా కేసు తెలంగాణకి చెందినది. కాంగ్రెస్కి చెందిన పన్నెండు మంది శాసనసభ్యులు తమ పార్టీని తెలంగాణా పాలక పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితిలో “విలీనం” చేశారు. వార్తా కధనాల ప్రకారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ శాసనసభ్యులు గుంపులుగుంపులుగా బిజెపిలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ శాసనసభ్యులు కాస్త ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మంచిది. వారు కనుక క్షుణ్ణంగా పరిశీలన చేస్తే తమ చర్యలు భవిష్యత్తులో తమ మెడకి చుట్టుకుంటాయి అని అర్థమవుతుంది. ఇప్పటికైతే పద్దెనిమిది మందిలో పన్నెండు మంది వెళ్ళి పాలక పార్టీలో చేరితే తమకేమి నష్టం లేదు అని భావిస్తున్నారు. వారి వాదన ప్రకారం, శాసనసభ్యులలో మూడింట రెండొంతుల మంది కలిసి పార్టీని పాలక పార్టీలో విలీనం చేస్తే అది ఫిరాయింపు కిందకి రాదు.
వారికి చట్టం సరిగ్గా అర్థం కాలేదు అని సుస్పష్టం. పదవ షెడ్యూల్ లోని నాల్గవ పేరా ప్రకారం
- ఒక పార్టీ మొత్తంగా మరొక పార్టీలో విలీనం అవ్వాలి.
- పై చెప్పిన దాని పర్యవసానంగా, మూడింట రెండొంతులకి తక్కువ కాకుండా ఆ పార్టీ సభ్యులు మరొక పార్టీలో విలీనం అవ్వాలి.
- మూడింట రెండొంతుల మంది మరొక పార్టీలో విలీనం అయితేనే ఆ విలీనానికి చట్టబద్ధత ఉంటుంది.
దీని అర్థం ఏంటంటే పదవ’ షెడ్యూల్ లోని నాల్గవ పేరా ప్రకారం ఒక పార్టీ మొత్తం మరొక పార్టీలో విలీనం అయితేనే దానికి చట్టబద్ధత ఉంటుంది. అలాగే దీనికి ఆ పార్టీ చట్టసభ సభ్యులలో మూడింట రెండొంతుల మంది సమ్మతించాలి. కాబట్టి మూడింట రెండొంతుల మంది మరొక పార్టీలో విలీనం అయినా కూడా పార్టీ మొత్తం విలీనం అవ్వకపోతే అది చట్టబద్ధ విలీనం కాదు. అందువలన పార్టీ మొత్తం విలీనం అవ్వనప్పుడు శాసనసభ్యుల విలీనానికి చట్టబద్ధత ఉండదు. కాబట్టి వాళ్ళు ఫిరాయింపుదారుల కిందకి వస్తారు, అనర్హతకి యోగ్యులు.
ఫిరాయింపు నిరోధక చట్టం అనేది ఫిరాయింపులని నిర్మూలించడానికే కానీ దానిని ప్రోత్సహించడానికి కాదు అనే విషయం శాసనసభ్యులు తెలుసుకుంటే మంచిది. వ్యక్తిగత ఫిరాయింపుదారులని శిక్షించడానికి, అదే సమయంలో పార్టీ మొత్తంగా విలీనం అయినప్పుడు దాని ప్రకారం నడుచుకునేవాళ్ళని కాపాడటానికి ఈ చట్టం చేశారు.
పదవ షెడ్యూల్ మొదట ఆమోదించినపుడు ఒక పార్టీ శాసనసభ్యులలో మూడింట రెండు వంతుల మంది విడిపోయి ఇంకొక కుంపటి పెట్టుకుంటే వారికి రక్షణ కల్పించే నిబంధనలు ఉండేవి. అయితే ఈ నిబంధనని రాజకీయనాయకులు పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని అర్ధం అయ్యాక దానిని తొలగించారు.
ఇక్కడొక ముఖ్యమైన విషయం చెప్పాలి. పదవ షెడ్యూల్ ప్రాధమిక లక్ష్యం ఫిరాయింపులని నిరోధించటం, ఆ విధంగా పార్టీ వ్యవస్థ, ప్రభుత్వ సుస్థిరతని కాపాడటం. తొలగించిన మూడవ పేరాని, నాల్గవ పేరాని చూస్తే మనకి ఇది స్పష్టం అవుతుంది. మూడవ పేరా పార్టీ చీలికకి సంబంధించింది అయితే, నాల్గవ పేరా పార్టీ విలీనానికి సంబంధించింది.
వ్యక్తిగతంగా కానీ గుంపుగా కానీ పార్టీతో సంబంధం లేకుండా కనుక శాసన సభ్యులు నిర్ణయం తీసుకుంటే అది ఫిరాయింపు కిందకే వస్తుంది. పార్టీ విలీనం అవ్వాలి అని నిర్ణయిచుకుంటేనే వీరికి రక్షణ. అందువలన ఒక పార్టీ నుండి గెలిచిన వారు ఆ పార్టీ ఇంకొక పార్టీలో విలీనం అవ్వాలి అని నిర్ణయించుకుంటే తప్ప పార్టీ మారటానికి లేదు.
ఈ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల శాసనసభలలో చోటుచేసుకుంటున్న ఫిరాయింపులు చూస్తుంటే ఒక పార్టీలో మూడింట రెండొంతుల మంది శాసనసభ్యులు పాలక పార్టీలో విలీనం అయితే అది చట్టబద్ధమే అన్న ఊహలో ఉన్నట్టున్నారు. ఈ నేపధ్యంలో రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య (2007) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వివరణాత్మకమైనది. ఈ కేసు పార్టీలో చీలికకి సంబంధించింది. అయితే ఆ కేసులో ఇచ్చిన తీర్పును పార్టీ విలీనానికికూడా అన్వయించవచ్చు. “పార్టీని వీడిన వారు అ ఆ పార్టీలో చీలిక చోటు చేసుకుంది అని ప్రాధమికంగా నిరూపించాలి.
అలాగే జగ్జీత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా లో కూడా శాసనసభా పక్షంలో చీలికకు పార్టీలో చీలిక ముందస్తు అవసరమని సుప్రీం కోర్టు పేర్కొంది. రాజేంద్ర సింగ్ రాణా కేసులో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, జగ్జీత్ సింగ్ కేసులో తీర్పులో పేర్కొన్న అంశాలతో ఏకీభవించింది. ఇవే విలీనం కేసులకి కూడా వర్తిస్తాయి.
తెలంగాణలో పద్దెనిమిది మంది కాంగ్రెస్ శాసనసభ్యులలో పన్నెండు మంది పాలక టిఆర్ఎస్ పార్టీలో విలీనం అయ్యారు. దీనికి ముఖ్యమంత్రి మద్దతు, సభాపతి ఆమోదం లభించాయి. ఒక చర్యతో తక్షణమే కాంగ్రెస్ శాసనసభ్యులు టిఆర్ఎస్ సభ్యులు అయిపోయారు.
ఈ నేపధ్యంలో మనం రెండు విషయాలు గమనించాలి.
మొదటిది, పదవ షెడ్యూల్ లోని నాల్గవ పేరా పార్టీ ఇంకొక పార్టీలో విలీనం కావాలి అని చెబుతుంది. దీనర్థం పన్నెండు మంది కాంగ్రెస్ అభ్యర్ధులు టిఆర్ఎస్ లో విలీనం అవ్వటానికి కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ లో విలీనం కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలో విలీనం అయ్యిందనటానికి ఎటువంటి సాక్ష్యం లేదు. అందువలన ఈ విలీనానికి చట్టబద్ధత లేదు.
అంతేకాక టిఆర్ఎస్ లో విలీనం అవ్వాలి అనే నిర్ణయం తీసుకోవాల్సింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీయే కాని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాదు. జగ్జీత్ సింగ్ తీర్పులో సుప్రీం కోర్టు ఈ విధంగా పేర్కొంది- ఒక అభ్యర్ది జాతీయ పార్టీ తరుపున పోటీ చేసుంటే ఆ జాతీయ పార్టీలో చీలికే లెఖ్కలోకి వస్తుంది తప్ప రాష్ట్ర శాఖలో చీలిక కాదు.
రెండవది, సభాపతి ఈ విలీనాన్ని ఆమోదించి ఫిరాయింపు శాసనసభ్యులని టిఆర్ఎస్ సభ్యులుగా ఆమోదించారు అని వార్తా కధనాలలో ఉంది.
పదవ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ లోని ఆరవ పేరా కింద దరఖాస్తు వస్తేనే సభాపతికి చర్యలు తీసుకునే అధికారం ఉంది. అటువంటి దరఖాస్తు ఏదీ కాంగ్రెస్ పార్టీ సమర్పించినట్టు కనిపించడం లేదు. కాబట్టి విలీనాన్ని ఆమోదిస్తూ సభాపతి తీసుకున్న నిర్ణయానికి చట్టంలో చోటు లేదు.
“పదవ షెడ్యూల్ ప్రకారం సభాపతి ముందుగా పేరా 6 కింద అనర్హతకి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కేవలం పేరా 3, పేరా 4కింద నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. పేరా 6 కింద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినపుడే తనకి పదవ షెడ్యూల్ లో ఉన్న అధికారాలు దఖలుపడతాయి.” అని రాజేంద్ర సింగ్ రాణా కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది.
ఈ విశ్లేషణ ప్రకారం తెలంగాణాలో పన్నెండు మంది శాసనసభ్యుల విలీనం చట్టబద్దమైనది కాదు. ఈ విలీనాన్ని ఆమోదించిన సభాపతి నిర్ణయం చట్టానికి లోబడి ఉన్నట్టు లేదు. అందువలన కాంగ్రెస్ సభ్యులు స్వచ్ఛందంగా తమ సభ్యత్వం వదులుకున్నారు కాబట్టి పదవ షెడ్యూల్ లో పేరా 2 (1)(a)ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలి.
-పి.డి.టి. ఆచారి
వ్యాసకర్త లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్
‘ద వైర్’ వెబ్సైట్ సౌజన్యంతో