రాజకీయ ఆటలు జరుగుతుంటే అందులో దూరడం బీజేపీకి అలవాటే. వ్యవస్థల ద్వారా రాజకీయాలు నడిపించడం బీజేపీకి బాగా తెలుసు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇటువంటి రాజకీయాలనే నడుపుతుంది. ఏపీలో మాత్రం బీజేపీ ఏం చేస్తుంది..? ఏపీలో అనేక రాజకీయ వివాదాల్లో బీజేపీ పాత్ర ఏంటి..? అన్నిటి కంటే ఏపీకి మూడు రాజధానుల వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏంటి..? అనే ప్రశ్నకి మాత్రం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు. అటు కోర్టుల్లో వేస్తున్న అఫడవిట్లలో రాజధాని విషయంలో మాకేం సంబంధం లేదు అంటుంది..! ఇటు నాయకుల మాటల్లో ఒక్కోసారి ఒక్కోలా చెప్తుంది…!! రాజధాని అంశం తెరపైకి వచ్చి ఏడాది గడిచినా బీజేపీ మాత్రం “ఏపీలో గోపి (గోడ మీద పిల్లి)లా వ్యవహరిస్తోంది..!!
బాబుని మించిన సోము..!!
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొన్ని విషయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబును మించిపోయారు. బీజేపీ ముఖ్య నాయకుడిగా, ఎమ్మెల్సీగా, అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఆయన యూటర్న్ తీసుకున్నారు. అత్యంత కీలకమైన ఏపీ రాజధాని అంశం రాజధానిలో ఆయన పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి..!!
జనవరి 2, 2020: “అమరావతి అనేది ఒక భ్రమ. చంద్రబాబు సృష్టించిన ఆ భ్రమలో ఏపీ ప్రజలు పడొద్దు. చంద్రబాబు ప్రజల్ని గందరగోళ పరుస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను రాజధాని తరహాలో అభివృద్ధి చేయాలి. రాయలసీమలో పరిశ్రమలు, కోస్తాలో పోర్టులు ఏర్పాటుచేయాలి”
జులై 31, 2020: “ఏపీ 3 రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం కల్పించుకోదు. గతంలో రాజధాని పేరిట చంద్రబాబు సింగపూర్, జపాన్, చైనా అంటూ మభ్యపెట్టినా కేంద్రం కల్పించుకోలేదు. ఇప్పుడు కూడా జగన్ సర్కార్ విషయంలో కల్పించుకోదు.”
ఆగస్ట్ 22, 2020: “రాజధాని ఏర్పాటులో స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు ఏర్పాటుచేసుకోవచ్చు. దానికి బీజేపీ ఎంత మాత్రం అడ్డు రాదు.”
డిసెంబర్ 14, 2020 : “అమరావతిలోనే రాజధాని ఉండాలి. ఇందులో మరో మాటకు తావులేదు. మోడీ మనిషిగా చెబుతున్నాను, అమరావతే ఏపీ రాజధాని. 3 రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నాం.”
ఇదీ పరిస్థితి ఇలా నెలల వ్యవథిలోనే మాట మార్చేశారు సోము వీర్రాజు. అమరావతికి మద్దతుగా విజయవాడలోనే ఏపీ బీజేపీ కార్యాలయం కడుతున్నామని.. 1800 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆగలేదని, ఫ్లై ఓవర్ పూర్తయిందని.. బీజేపీ అమరావతి వైపే ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని చెప్పుకొచ్చారు. ఇదే సోము వీర్రాజు డిసెంబర్ 12 న తిరుపతిలో శోభాయాత్రలో మాత్రం హడావుడి చేశారు. ఆ రోజు ఇదే రాజధాని విషయమై ప్రకటన చేసి ఉండొచ్చు కదా? మోడీ మనిషిగా నేను చెబుతున్నానంటూ ఇదే ప్రకటన అక్కడ చేయొచ్చు కదా? అమరావతే రాజధానిగా ఉండాలని విస్పష్టంగా ప్రకటించి తిరుపతి ఎన్నికల బరిలో దిగొచ్చు కదా? కానీ సోము సేమ్ చంద్రబాబులాగా రాజకేయాలు చేస్తున్నారనేది ఏపీలో అర్ధమవుతుంది. అందుకే ఇవన్నీ చూస్తున్న కొందరు బీజేపీ నాయకులు మాత్రం ఎందుకు ఊరుకుంటారు..? సోము ఇలాగే మాట్లాడితే, ఇలాగే వ్యవహరిస్తే పార్టీకి ఉన్న ఒక్కశాతం కూడా కష్టమే.., ఏదోటి నిలకడ రాజకీయం చేయండి బాబూ అంటూ బీజేపీ నేతలు కొందరు కేంద్రం స్థాయిలో పిర్యాదులు పంపిస్తున్నారు..!!