బిజెపికి ఏక నాయకత్వ సూత్రం ఎప్పుడూ వర్తించడం లేదు. సాధారణంగా జాతీయ పార్టీలో రాష్ట్ర విభాగాల్లో ఒక నాయకత్వం ఏనాడు సక్రమంగా పనిచేయదు. వైఎస్ బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఆయన నాయకత్వం బాగానే పనిచేసినా, ఆయనకు కూడా కొంత మంది పొమ్మనలేక పొగపెట్టిన వారు ఉన్నారు. ప్రస్తుతానికి ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు లేనప్పటికీ, బలమైన కార్యకర్తల వ్యవస్థ లేనప్పటికీ, పేరు అన్న నాయకులకు మాత్రం కొదవేమి లేదు. వ్యాపారాలు ఉన్న వాళ్ళు, ఆస్తులు ఉన్న వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు అందరికీ తమ అడ్డాగా బీజేపీనే ఎంచుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వ్యవహారాల్లో హాట్ టాపిక్ గా ఉన్న ఈ అంశాలపై ఏపీ బిజెపి ఏం చేస్తుంది అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. మనం చెప్పుకున్నట్లే..ఏపి బిజెపిలో మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి కమ్మ బిజెపి. అంటే సుజనా చౌదరి లాబీయింగ్ లతో కామినేని శ్రీనివాస్ తదితరులు నడిచే బిజెపి ఇది. రెండవది బిజెపి.. కాపు బిజెపి. ఇది ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. పైడికొండల మాణిక్యాలరావు లాబీయింగ్ లతో జనసేన పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు నడిచే బిజెపి. ఇంకోటి కేంద్ర బిజెపి. ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పుడప్పుడు తెరవెనుక, తెరముందు రాజకీయాలు చేసే బిజెపి. దీనికి జివిఎల్ లాంటి వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ బిజెపిలో విభాగాలు అన్నింటిని పక్కన పెడితే ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాలపై అత్యంత చురుకుగా పావులు కడుపుతున్నది మాత్రం కమ్మ బీజేపీనే.
నిమ్మగడ్డ విషయంలో మళ్ళీ మంతనాలు..!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసును ఇటువైపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత సీరియస్ గా తీసుకున్నారో, అటు వైపు రమేష్ కుమార్ కు మద్దతుగా బీజేపీలోని ఓ విభాగం అంతే సీరియస్ గా ఉంది. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను జగన్ తప్పించి, కానగరాజ్ ను నియమించిన వెంటనే బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కోర్టు లో పిటిషన్ వేశారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కామినేని శ్రీనివాస్, సుజనాచౌదరి కలిపి హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో కలిశారు. వీటన్నిటికీ తెర వెనక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మాత్రం వెన్నంటి ఉండి ప్రోత్సహించేది ఈ ఇద్దరు నాయకులే. సో.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టకుండా ఉండటానికి ఎన్ని అస్త్రాలు ప్రయోగించాలో అన్ని చేస్తున్నది. తాజా ఈ రోజు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేసింది. మరి దీనిని ఎదుర్కోవడానికి నిమ్మగడ్డ ఎస్ఈసి గా రావడానికి ఏపీ బిజెపి నాయకులు మళ్లీ మంతనాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈ నాయకులందరికీ పెద్ద దిక్కుగా మారిన కేంద్ర ప్రభుత్వంలో అత్యంత చురుగ్గా ఉన్న ఓ నాయకుడి సలహా మేరకు ఈ విభాగం పని చేస్తున్నట్టు తెలుస్తోంది.
మూడు రాజధానులపై మూడు మాటలు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అలా ఉంటే మూడు రాజధానుల బిల్లు కూడా ప్రస్తుతం గవర్నర్ చేతిలో ఉంది. ఆయన ఆమోదిస్తే ఏపీకి ఇక మూడు రాజధానులు వస్తాయి. దీన్ని అడ్డుకోవడానికి కూడా ఏపీ బిజెపిలో ఒ విభాగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో కూడా ఏపీ బీజేపీ మూడు విభాగాలు, మూడు మాటలు చెబుతోంది. కన్నా లక్ష్మి నారాయణ కన్ఫ్యూజన్ లో ఉంటూ ఒక్కో సారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. కానీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లాంటి వారు మాత్రం మొదటి నుంచి అమరావతే రాజధాని అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక కేంద్ర పరిధిలోని బిజెపి ప్రధాన ప్రతినిధులు మాత్రం రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని అది రాష్ట్ర పరిధిలోని అంశమని కుండబద్దలు కొడుతూ చెబుతున్నారు. ఇలా మూడు రాజధానుల అంశంలో బిజెపి మూడు రకాలుగా స్పందిస్తోంది. సో.. ఈ అంశం కూడా ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. గవర్నర్ చేతిలో బిల్లు ఉంది. ఆయన ఆమోదిస్తే వెంటనే మూడు రాజధానులు వచ్చి చేరుతాయి. దీన్ని అడ్డుకోవడానికి కూడా ఏపి బిజెపిలోని ఒక విభాగం సీరియస్ గా ప్రయత్నిస్తోంది. గవర్నర్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లు తిరస్కారానికి గురయ్యేలా మంతనాలు జరుపుతోంది. అటు నిమ్మగడ్డ విషయంలో ఇటు మూడు రాజధానుల వ్యవహారంలోనూ ఏపీ బిజెపిలోని ఈ ప్రధాన కూటమికి మాత్రం పెద్ద పని వచ్చిపడింది. వీరందరికీ సూత్రధారి గా ఉంటూ తెరవెనుక సలహాలు, సూచనలు ఇస్తున్న నాయకుడు మాత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి గవర్నర్ కు ఆదేశాలు ఇచేలా వత్తిడి చేస్తున్నట్లు సమాచారం.