బిజెపి జాతీయ పార్టీ నోడౌట్. పార్టీకి పునాదులు బాగానే ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ పునాదుల పరిస్థితి ఓకే.. ఇప్పుడిప్పుడే మెరుగు పర్చుకుంటున్నారు. కానీ పార్టీ కార్యాలయ పునాదులు ఎప్పుడు పడతాయనేదే ప్రశ్న. మోడీ గారు వింటున్నారా? షా గారూ చూస్తున్నారా? సోము గారు ఆలకిస్తున్నారా? ఏపిలో పార్టీ బలపడాలి అనుకుంటున్నారు బాగానే ఉంది. పార్టీ సభ్యత్వాలను వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు ఎగబాకుతున్నా.. రాష్ట్ర పార్టీ కార్యాలయ పునాది పడకపోవడమే ప్రశ్న.. ఇది మా ప్రశ్న కాదు పార్టీ అభిమానులను వేధిస్తున్న అవేదన.
ఉత్తరాదిన ప్రాంతీయ పార్టీల హవా
భారతీయ జనతా పార్టీ..కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీలో త్రిమూర్తులైన ప్రధాన మంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వ్యూహాలతో దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో చక్రం తిప్పుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి హావా కొనసాగుతున్నప్పటికీ దక్షిణాదిన అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఓడిస్సా, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో బిజెపి సొంతగా పుంజుకోని పరిస్థితి ఉన్నది.
భవిష్యత్తు వ్యూహరచనతోనే జనసేన పొత్తు
అయితే ఏపిలో రాబోయే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి ఎదగాలని భావిస్తున్నది. ఈ క్రమంలో భవిష్యత్తు వ్యూహరచనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బిజెపి పొత్తు పెట్టుకోంది. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు సీనియర్ నేత సోము వీర్రాజుకు ఇటీవల పార్టీ పగ్గాలు అప్పగించారు.
బిజెపికి తప్ప అన్ని పార్టీలకూ…
పేరుకు జాతీయ పార్టీయే కానీ బిజెపికి రాష్ట్రంలో సొంత పార్టీ కార్యాలయం అంటూ ఇప్పటి వరకూ ఏర్పాటు చేసుకోలేదు. అధికార వైసిపి తాడేపల్లిలో, ప్రతిపక్ష టిడిపికి మంగళగిరిలో, అదే విధంగా జనసేన పార్టీకి మంగళగిరిలో రాష్ట్ర పార్టీ కార్యాలయాలు ఉండగా బిజెపికి మాత్రం ఇంత వరకూ రాష్ట్ర పార్టీ వ్యవహారాలను నిర్వహించడానికి ఒక ప్రదేశం, వేదిక అంటూ ఏర్పాటు చేసుకోలేదు.
స్థలదాతకే సస్పెన్షన్ వేటు
రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రయత్నంలో భాగంగా విరాళాలను అయితే సేకరించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆ పార్టీ సీనియర్ నేత వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ వెయ్యి గజాల స్థలాన్ని పార్టీకి కేటాయించగా, ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపి గోకరాజు గంగరాజు పార్టీ కార్యాలయ నిర్మాణానికి తన వంతుగా లక్ష రూపాయలు విరాళం కూడా ఇచ్చారు. ఇంకా మరి కొందరు నేతలు కూడా పార్టీ భవన నిర్మాణానికి విరాళాలు ప్రకటించారు. అయితే పార్టీ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన దాత వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్నే ఇటీవల పార్టీ సస్పెండ్ చేసింది.
సోము హయాంలో జరిగేనా
ఈ నేపథ్యంలో ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందా లేదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ను బిజెపి సస్పెండ్ చేసిన వెంటనే ఆయన అఖిల భారత హిందూ మహసభ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులు కావడం విశేషం. హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ హయాంలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పునాది రాయి పడలేదు. సోము వీర్రాజు హయాంలో అయినా పార్టీ భవన నిర్మాణం జరుగుతుంది అనుకుంటే స్థల దాతనే పార్టీ నుండి బహిష్కరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సోము వీర్రాజు చర్యలు చేపడతారా?లేదా వేచి చూడాలి?