తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలి. ఆ స్థానాన్ని జనసేన, బీజేపీ కలిసి ఆక్రమించాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో తాడో పేడో తేల్చుకోవాలి. ఇదే బీజేపీ ప్రస్తుత వ్యూహం. అందుకే అధికార పక్షాన్ని వదిలేసి సంబంధం లేని విషయాలకు కూడా తెలుగు దేశాన్ని లాగుతోంది. అసందర్భంగానూ, అనవసరం గానూ తెలుగుదేశం ను విమర్శిస్తోంది.
సోము వీర్రాజుకు బిజెపి అధ్యక్షుడిగా ఇచ్చినప్పుడు ఎదో సాధారణ మార్పులు అని, టిడిపిని టార్గెట్ చేస్తారని, వైసీపీని అక్కడక్కడ ఇరుకున పెడతారని రాజకీయ విశ్లేషకులు భావించారు కానీ ఈ రెండు మూడు రోజులు పరిణామాలు చూస్తుంటే బిజెపి నాయకులు వ్యాఖ్యలు చూస్తుంటే బిజెపి ఒక పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లే కనిపిస్తోంది. అందుకు తగిన సాక్ష్యాలు కూడా లభిస్తున్నాయి.
ఈ వ్యాఖ్యల వెనక ఆంతర్యమేమిటో..?
తాజాగా ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు కు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. రాజధాని అమరావతి రైతుల విషయంపైనో, వైసీపీ నిర్ణయం పైనో, గవర్నర్ నిర్ణయం పైనో స్పందిస్తారేమో అనుకుంటే ఆయన టీడీపీ ని నిందించారు. అసలు అమరావతిని రాజధానిగా ఎంచుకోవడం టీడీపీ తప్పు అంటూ సంబంధం లేని విమర్శ ఒకటి చేశారు.
అంటే రాజధానిని ఎంచుకొని టిడిపి తప్పు చేసింది. మూడు రాజధానులు ఇచ్చి వైసీపీ ఏ తప్పు చేయలేదు అన్నట్టు పరోక్షంగా వైసీపీని సమర్దించి టీడీపీని నిందించే ప్రయత్నం చేశారు. * * సోము వీర్రాజు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. రైతులకు అన్యాయం జరగనివ్వబోము అంటూనే టిడిపి నాడు అవినీతికి పాల్పడటానికే అమరావతిని రాజధానిగా ఎంచుకుందని, చంద్రబాబు స్వార్థ రాజకీయాల ఫలితమే ఇప్పుడు అమరావతి రైతులు కష్టాలు అనుభవిస్తున్నారు అంటూ టిడిపిపైనే విమర్శలు చేశారు. నిజానికి అమరావతి విషయంలో నిర్ణయం తీసుకున్న వైసీపీకి కొన్ని సూటి ప్రశ్నలు వేసే వీలుంది. అతి పెద్ద పార్టీగా, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీగా కొన్ని సాంకేతిక అంశాలను పట్టుకొని వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయవచ్చు.
మూడు రాజధానుల వల్ల ఉపయోగం ఏమిటి? ఒక్కో రాజధాని నుండి మరొక రాజధానికి తిరగాలంటే ఎంత ప్రయాస, ఎంత సమయం పడుతుంది, ఎంత ఖర్చవుతుంది. అసలు దీని వెనుక జగన్ ఉద్దేశం ఏమిటి, వైసీపీ కి లాభం ఏమిటి అనే పలు సూటి ప్రశ్నలతో వైసీపీని రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేయవచ్చు కానీ బిజెపి అసలు ఆ దిశగా ఆలోచించడమే లేదు. ఎంత సేపు టిడిపిని, చంద్రబాబుని అసలు అమరావతి రాజధాని నిర్మాణమే తప్పన్నట్లు వ్యాఖ్యానిస్తూ కామెడీ చేస్తోంది.
అందుకే బీజేపీ టార్గెట్ ప్రస్తుతానికి టీడీపీ మాత్రమే. టీడీపీని సంపూర్ణంగా నాశనం చేసి ఆ స్థానంలోకి బీజేపీ-జనసేన కలిసి వచ్చి ఎన్నో కొన్ని స్థానాలు పంచుకొని పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఒకటి రెండు స్థానాలతో సరిపెట్టుకోవాలనే అంతర ఉద్దేశం కావచ్చు. పనిలో పనిగా టీడీపీ లోని కొంత మంది నాయకులను కూడా పార్టీలోకి వస్తాము అంటే కాదనకుండా చేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.