AP Breaking News: ఆంద్రప్రదేశ్ లో ఆర్ధిక సంక్షోభం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి, ఆ అప్పుల కోసం చేస్తున్న తప్పుల గురించి, ఆ అప్పుల వలన వచ్చే ముప్పుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతం కీలకమైన విషయం ఏమిటంటే రాబోయే నెల రోజుల్లో ప్రభుత్వానికి 85వేల కోట్లు కావాలి. ఈ నిధులు లేకపోతే బండి నడిచే పరిస్థితి లేదు. ఎందుకు అంటే.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి గానీ, గత ప్రభుత్వం దిగిపోయే ముందు చేసిన పలు పనులకు గానీ కోర్టు ఆదేశాలతో చేయాల్సిన చెల్లింపులకు గానీ ఇలా రకరకాల అంశాలకు సంబంధించి రూ.85వేల కోట్లు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అవి ఏమిటి అంటే….!
AP Breaking News: గత పాపాలను కూడా కడగాలి..!
గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంటే 2018 ఆగస్టు నుండి 2019 మార్చి వరకూ హడావుడిగా అనేక పనులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభించింది. ఎన్నికలకు ముందు వాళ్ళ మనుషులకు పనులు ఇస్తే.. ఆర్ధికంగా ప్రయోజనకారిగా, రాజకీయంగా ఏంతో కొంత ఉపయోగం అనే ఆలోచనలో ఇచ్చేసింది. ఎన్నికల సమయానికి తాము ఇవి చేశాము అని చెప్పుకోవడం కోసం పలు భవనాలు, రోడ్లు, ప్రాజెక్టులు ఇలా చాలా వాటికి హడావుడిగా శంకుస్థాపనలు చేసింది. వాటిలో కొన్ని పూర్తి కాగా కొన్ని వివిధ దశల్లో ఆగిపోయాయి. ఆయితే ఆ తరువాత ఎన్నికలు జరిగాయి. టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత టీడీపీ హయాంలో చేపట్టిన పనుల్లో 25 శాతం కంటే తక్కువగా జరిగిన పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పనులకు మరల టెండర్లు పిలుస్తామని చెప్పింది. 25 శాతం కంటే ఎక్కువగా జరిగిన పనులను కొనసాగించారు…
అవి పూర్తి అయ్యాయి. అయితే వాటికి ఈ ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో ఆ కాంట్రాక్టర్ లు నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాంట్రాక్టర్ల పిటిషన్ లను విచారించిన హైకోర్టు.. వారికి నాలుగు వారాల్లో బిల్లు బకాయిలను చెల్లింపులు చెల్లించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. లేకపోతే వడ్డీతో సహా చెల్లించాలని పేర్కొంది. ఒక వేళ ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేసినా కాంట్రాక్టర్లకు అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్లు పనులు చేశారు. బిల్లులు అడుగుతున్నారు. దానిలో ఏమి తప్పులేదు. కోర్టు ఇదే భావిస్తుంది. కాంట్రాక్టర్ లు అందరికీ చెల్లించాల్సింది ఎంత అంటే సుమారు రూ.60వేల కోట్లు. గత ప్రభుత్వం చివరి ఆరు నెలలు, సంవత్సరం కాలంలో పనులు చేపట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తి చేసిన పనుల విలువ సుమారు రూ.60వేల కోట్లు. వీటిలో 10 నుండి 20 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. మిగిలిన బకాయిలు మొత్తం కోర్టు ఆదేశాల మేరకు చెల్లించాల్సిందే.
ఉద్యోగులకు అడిగినవి ఎలా..!?
ఇక పోతే ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్నారు. పీఆర్సీ ఇవ్వాలనీ, జీతాలు సమయానికి ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న డీఏలు ఇలా 45 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. మొత్తం 45 డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోయినా నాలుగైదు డిమాండ్లను పరిష్కరించాలన్నా కనీసం రూ.25 వేల కోట్లు కావాల్సి ఉంటుంది. ఉద్యోగుల పోరాటం ఓ పక్క ఉదృతం అవుతోంది. వాళ్ల ఉద్యమాన్ని అంత తేలికగా తీసుకోవడానికి వీలులేదు. కాంట్రాక్టర్ ల చెల్లింపులకు వాళ్లు తిరుగుబాటు చేస్తున్నారు. ఇటు ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం పట్టుబడుతున్నారు. వీళ్ల సమస్యలను తీర్చాలంటే ప్రభుత్వానికి ఈ నెల రోజుల్లో 85 వేల కోట్లు కావాలి. జనవరిలో చెల్లించాల్సిన అమ్మఒడి జూన్ కు వెళ్లిపోవడం వల్ల ప్రభుత్వానికి కొంత వెసులుబాటు వచ్చినట్లు అయ్యింది. ప్రభుత్వం రూ. 85 వేల కోట్లను ఎలా సర్దుబాటు చేస్తుందో వేచి చూడాలి.