నేటి కేబినెట్ భేటీలో ఆసరా..పెన్షన్ల పెంపుపై నిర్ణయం
జిల్లాల పెంపు..నేతల అభ్యంతరాల పైనా చర్చ
ఏపీలో జగన్ ప్రభుత్వం తాము ఇచ్చిన రెండు కీలక అంశాల పైన బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద మద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో మొత్తం 23 అంశాలు అజెండాగా ఫిక్స్ చేసారు. మంత్రులుగా ప్రమాణం చేసిన ఇద్దరు తొలి సారి కేబినెట్ సమావేశానికి హాజరవుతున్నారు. కేబినెట్ సమావేశంలో మంత్రుల సీటింగ్ వరుసను మార్చారు. ఇక, ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్ఠగా మారిన ఫోన ట్యాపింగ్ అంశం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ తేల్చేదాకా ముందుకే వెళ్లాలని..ప్రభుత్వాన్ని డామేజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని..దీనిని తేల్చి..ప్రజల ముందు పెట్టాలని పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు..ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ఫ్రచారం పైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా వైయస్సార్ ఆసరా….సామాజిక పెన్షన్ రూ 250 పెంపు వంటి నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. కొత్తి జిల్లాల ఏర్పాటు అంశంలో పార్టీలో వస్తున్న అభిప్రాయాల పైనా చర్చించనున్నారు. వైయస్సార్ భీమా పధకం పైనా కేబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ పై సీఎం జగన్ సీరియస్..
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల పైన సీఎం జగన్ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వాన్ని డామేజ్ చేసందుకు ప్రతిపక్షాలు..ఒక వర్గం మీడియా ఉద్దేశ పూర్వకంగానే ఇటువంటి కధనాలను ప్రచురించి.. ఆరోపణలు చేస్తున్నారనేది ప్రభుత్వం అంచనా. దీంతో..ఇప్పటికే ఈ కధనాలు ప్రచురించిన మీడియా సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అదే విధంగా ఇదే అంశం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సమయంలో కధనం ప్రచురించిన పత్రికను కేసులో ఇంప్లీడ్ చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. ఇక, ఇది జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు నేరుగా ప్రధానికి లేఖ రాసారు. రాజకీయంగానూ విమర్శలు..ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. దీంతో..ప్రభుత్వం తనంతట తానుగా ఈ విమర్శల పైన విచారణకు ముందుకు వచ్చి..వీటి వెనుక ఉన్న వాస్తవాలను ..కుట్రను బహిర్గతం చేయాలని భావిస్తోంది. కోర్టులో ఈ అంశం గురువారం విచారణకు రానుంది. కోర్టు ఇచ్చే సూచనలు పాటించటమా..లేక ముందుగానే దీని పైన విచారణకు ఆదేశించి ఆరోపణలు చేస్తున్న వారికి ధీటుగా సమాధానం ఇవ్వటమా అనే అంశం పైన కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖ లో కేంద్ర సంస్థల విచారణ కోరటం..హైకోర్టులోనూ అదే విధంగా కోరటంతో..ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
పెండింగ్ హామీల అమలుపైనా నిర్ణయం..
ఇక, ఎన్నికల హామీలు పెండింగ్ లో ఉన్న వాటి పైన ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా..పొదుపు సంఘాల మహిళలకు 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న అప్పును నాలుగు విడతల్లో చెల్లించేందుకు నిర్ణయించిన వైయస్సార్ ఆసరా పధకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇక, ప్రతీ ఏటా సామాజిక పెన్షన్ లను రూ 250 చొప్పున పెంచుతూ మూడు వేలకు పెంచుకుంటూ పోతామని జగన్ అప్పట్లో ప్రకటించారు. ఈ ఏడాది పెంచాల్సిన రూ 250 కి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. వైయస్సార్ భీమా..బియ్యం డోర్ డెలివరీ..నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం..బీసీ కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు ..సెప్టెంబర్ 5నుండి జగనన్న విద్యా కానుక అమలు పైన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటు పైన సొంత పార్టీలో నే అనేక ప్రాంతాల్లో భిన్న వాదనలు తెర మీదకు వస్తున్నాయి. జిల్లాల పేర్లు మొదలు హద్దుల వరకు అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం పైన ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో..బుధవారం జరిగే కేబినెట్ భేటీ కీలకంగా మారుతోంది.