“మీకు ఒక బస్సు ఉంది. దానికి డీజిలు వేయించే ఆర్ధిక సామర్ధ్యాలు లేవు. ఈ డీజిలు విషయాన్ని వదిలేసి.., బసుకి హంగులు, రంగులు, అదనపు ఆర్భాటాలు చేయిస్తున్నారు. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా అనవసర ఖర్చులు పెడుతున్నారు. డీజిలుకి వచ్చే సరికి దారిన వెళ్తూ కనిపిస్తున్న ప్రతీ పెట్రోల్ బ్యాంకు దగ్గర అప్పు చేస్తున్నారు. మళ్ళీ ఇస్తాం, మళ్ళీ ఇస్తాం అంటూ డీజిలు అయిపోతున్న ప్రతీసారి అప్పు చేసి కొట్టిస్తున్నారు. ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది..? వెళ్లినంతకాలం వెళ్తుంది. ఆ తర్వాత ఎవరూ డీజిలు కొట్టరు. అప్పు ఎక్కువైపోతోంది. పాతవి తీర్చేలేక.., కొత్తగా డీజిలు కొట్టించలేక బస్సుని ఇక ఆపేయాల్సిందే. మూలాన వదిలేయాల్సిందే. ప్రయాణికుల్ని దించేయాల్సిందే కదా..! ఇప్పుడు ఏపీ విషయానికి వద్దాం..!!
ఏపీకి ముప్పు పొంచి ఉంది. అప్పు చేసి పాలన అందిస్తున్న జగన్ ప్రభుత్వానికి పైన చెప్పుకున్న బస్సు మాదిరిగా నడిపిస్తుంది. నవంబరు నెలాఖరుకి ప్రభుత్వ మొత్తం ఋణం రూ. 3 . 73 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి నవంబరు మధ్యలోనే (అంటే కేవలం 8 నెలల వ్యవధిలోనే) ప్రభుత్వం రూ. 73 వేల కోట్లు అప్పులు చేసింది. సాధారణంగా ఏప్రిల్ నుండి వచ్చే మార్చి వరకు (ఆర్ధిక సంవత్సరంలో) రూ. 48 వేల కోట్లు మాత్రమే అప్పులు చేయాలని లక్ష్యం పెట్టుకోగా 8 నెలలు పూర్తి కాకుండానే అంతకు మించి భారీగా అప్పులు చేసేసారు.
నెలకు రూ. 8 వేల కోట్లు లేకుంటే బండి నడవదు..!!
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు అన్ని ఇవ్వాలంటే నెలకు రూ. 10 నుండి 12 వేల కోట్లు కావాలి. ఆదాయం పోగా మిగిలింది మొత్తం అప్పుగా తీసుకొస్తున్నారు. కేవలం నవంబరు నెలలోనే ఏపీ ప్రభుత్వం రూ. 13 వేల కోట్లు అప్పు చేసిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సగటున నెలకు రూ. 8 వేల కోట్లు అప్పు తీసుకోకుంటే పథకాలు, జీతాలు, సౌలభ్యాలు నడిచే పరిస్థితి లేదు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకి మరో రూ. 30 వేల కోట్లు అప్పులు చేయాల్సిందే. సో.., ఈ లెక్కన ఈ వార్షికంలో రూ. లక్ష కోట్లు అప్పు చేస్తున్నట్టు ఆర్ధిక శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
బాబు వదిలింది కొంత.. జగన్ చేస్తున్నది దారుణం..!!
చంద్రబాబు ఈ అప్పులకు నాంది పలికారు. అప్పులు తీసుకొచ్చి పాలన చేయాలి, పథకాలకు డబ్బులు ఇవ్వాలి అనే సూత్రాలను మొదలు పెట్టింది ఆయనే. దాన్ని ఇప్పటి సీఎం జగన్ మరింత ముందుకు తీసుకు వెళ్తూ ముందూ వెనుక ఆలోచించడం లేదు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు దిగిపోయే చివర్లో పసుపు – కుంకుమ.. పెన్షన్లు పెంపు అంటూ భారీగా అప్పులు చేసారు. మొత్తానికి చంద్రబాబు దిగే సమయానికి ఏపీకి రూ. 2. 35 లక్షల కోట్లు అప్పు ఉండగా.. జగన్ ఈ తక్కువ వ్యవధిలోనే దాన్ని రూ. 3 . 73 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. తిలా పాపం తలో పిడికెడు తరహాలో ఏపీని అప్పుల ఊబిలో దించుతున్న పాపంలో చంద్రబాబు మొదటి వాటా పంచుకుంటే జగన్ దాన్ని పీక్స్ తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు ఏమిటీ భవిత..!?
నెలకు రూ. 8 వేల కోట్లు అప్పులు తప్పడం లేదు. మరోవైపు జగన్ ప్రభుత్వం కూడా అప్పులు కొత్తగా పుట్టడం లేదు అని తెలుసుకుని… ఏపీకి ఆదాయం పెరిగే అవకాశాలు వెతుకుతుంది. అందుకే బాదుళ్ళు ప్రారంభించింది. ట్రాఫిక్ చలాన్లు పెంచడం, వివిధ ఫైన్లు పెంచడం, మద్యం ధరలు పెంచడం, పెట్రోలు సుంకం పెంచడం (చంద్రబాబు ఉన్నప్పటి నుండి ఉంది).., రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం.. ఇలా నానా మార్గాలు అన్వేషిస్తున్నారు. సో.., ఏపీకి ఆదాయ మార్గాలు పెరిగే దారులు వెతుకుతున్నా.., ఆదాయం పెరుగుతున్నా., అప్పులు మాత్రం రావాల్సిందే. కొత్త అప్పులు పుడితేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. లేకపోతే మొత్తం ఆగిపోతుంది. ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ లో ఏపీ ఏనాడో దారి తప్పింది..!!