ప్రభుత్వం ఏమి చేసినా వ్యతిరేకించడం ప్రతిపక్షం పని. రాజకీయాలలో ఇది సాధారణమే. ప్రస్తుతం ఏపిలో ఉన్న పరిస్థితుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం మంచి చేసినా దానిలో తప్పు ఒప్పులు వెతకటం ప్రతిపక్షం పనిగా పెట్టుకుంటుంది. ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల విభజనకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాలను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా విభజించాలని సమాయత్తం అవుతోంది. అందుకు ఒక కమిటీని కూడా నియమిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజే జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి వరకు ఓకే. కానీ జిల్లాల విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి ప్రణాళికతో ఉంది, సీఎం నిర్ణయానికి అనుగుణంగా ఎటువంటి పోరాటం లేకుండా మంచి సలహాలు ఇస్తూ ముందుకు వెళ్తారా? లేదా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
విభజన అంటేనే చాలా క్లిష్టమైన పరిస్థితి
జిల్లాల విభజన అనేది సాదాసీదా అంశమేమి కాదు. పరిస్థితి అనేది కాదు. ఇది సున్నితమైన అంశం. భావోద్వేగాలతో ముడిపెట్టుకున్నది. భౌగోళిక పరిస్థితులతో ముడిపడి ఉన్నది. ఒక జిల్లాను రెండు లేదా మూడు జిల్లాలుగా క మార్చాలి అంటే ఆ జిల్లాలోని ప్రజలందరినీ కన్వీన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా వరకు వ్యతిరేకత వస్తుంది. చాలా వరకు అనుకూలత వస్తుంది. ఇది రాజకీయాలకు సంబంధం లేకుండానూ ఒక్కోసారి ప్రభావం చూపుతుంది. ఈ తరుణంలోనే జిల్లాల విభజనకు ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేయడం కూడా ఒక రకమైన భావోద్వేగంతో కూడుకున్నదే. రాష్ట్రంలో చాలా వరకు పెద్ద జిల్లాలు ఉన్నాయి. 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షల జనాభా ఉన్న జిల్లాలు ఉన్నాయి. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగా పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా చేసినా పెద్దగా ప్రయోజనం చేకూరదు. ఇది మరింత సమస్యలను తెచ్చిపెడుతుంది. అనేక పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రాలు మారు మూల పల్లెలకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇది వరకే మనం చెప్పుకున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అరకు, ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, కాకినాడ, తూర్పు గోదావరి ఇటువంటి అనేక జిల్లాల్లో భౌగోళికంగా పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలకు, ఆ పార్లమెంట్ పరిధిలోని పల్లెలకు సంబంధం లేకుండా వందల కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పుడు పార్లమెంటు నియోజక వర్గం ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి ఇదే హామీ ఇచ్చి దీని పైనే దృష్టి పెట్టారు.
ప్రజల నుంచి కొంచెం కదలిక వచ్చినా టీడీపీకి ఊపు అందుకున్నట్లే
జిల్లాల విభజనపై ఇప్పటికే పలు జిల్లాలు, పలు ప్రాంతాల నుండి అనేక డిమాండ్ లు ఉన్నాయి. ఒక వేళ విభజన అంటూ జరిగి పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికగా అమలు చేస్తే మాత్రం చాలా ప్రాంతాల నుండి ఉద్యమం, పోరాటం ఆరంభం అవుతుంది. ఇలా ప్రజల నుండి పది శాతం పోరాటం ముందుకు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఇక పైకి లేస్తుంది. ఆయా జిల్లాలు, ప్రాంతాల వారీగా తెలుగుదేశం పార్టీ కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతుంది. ప్రభుత్వం చేసే చిన్న తప్పును కూడా ఎండగట్టడానికి చంద్రబాబు సిద్ధంగా ఉంటారు. జిల్లాల విభజన అనే సున్నిత అంశాన్ని రాజకీయంగా రచ్చ చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. ఇప్పటికే ప్రకాశం జిల్లా మార్కాపురం, కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, అనంతపురం జిల్లాలో హిందూపురం, రాయదుర్గం, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఇలా అనేక జిల్లాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కొత్త జిల్లాలు డిమాండ్లు తీసుకు వచ్చాయి. ఒక సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రజల నుంచి కాస్త స్పందన వచ్చి పోరాటం మొదలైన వెంటనే తెలుగుదేశం పార్టీ ఊపందుకొని రోడ్ల పైకి వచ్చి రచ్చ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మరి ప్రజల నుండి ప్రతిపక్షాల నుండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, పోరాటాలు ఎదురవ్వకుండా జిల్లాల విభజన సజావుగా జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.