AP Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఇప్పటి వరకు మంచి సంబంధమే ఉంది.. ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న సర్దుబాట్లను అర్ధం చేసుకుని ఉద్యోగులు ఏ నాడూ గీత దాటలేదు. కానీ ఎందుకో వారం రోజుల నుండి తేడా కొడుతోంది.. వారం రోజుల కిందట ఒక మీడియా మీటింగ్ లో ఉండగా.. ప్రభుత్వ సలహాదారు సజ్జల ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం.. ఆ తర్వాత చల్లబడ్డాక నిన్న (మంగళవారం) ఉద్యోగులు వచ్చి సజ్జలని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం.. ఈరోజు ప్రభుత్వం నుండి ఉద్యోగుల కోసం ఒక సానుకూల నిర్ణయం దిశగా ఆలోచన చేయడం చూస్తుంటే.. ఏదో తేడా కొడుతున్నట్టే కనిపిస్తుంది..
నిన్న ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు, చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతుంది. ఇంత కాలం కొన్ని ఇబ్బందులు, కొన్ని అనుకోని బాధలు అనుభవిస్తున్నా ఏనాడూ వీళ్లు బయటకు రాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా బయటకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని నిన్న ఉద్యోగ సంఘాల నేతలు కలిసి ఓ వినతి పత్రాన్ని ఇచ్చారు. ఆయన మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చినంత బిల్డప్ ఇచ్చారు. నెలరోజులు గడువు ఇస్తున్నాము, తమ డిమాండ్ లను పరిష్కరించకుంటే రోడ్డు ఎక్కుతాం, ఆందోళన చేస్తామంటూ చెప్పుకొచ్చారు.. ఇది వార్నింగ్ లా చూడాలా..!? లేదా సజ్జల ఇచ్చిన “కంట్రోల్ వార్నింగ్ కి కవరింగ్” లా చూడాలా అనేది కాస్త లోతుగా ఆలోచించాలి..!
AP Employees: నిజంగానే అవస్థల్లో ఉన్నారు.. కానీ..!
నిజానికి ఉద్యోగులకు ఇబ్బందులున్నాయి. ఏన్నో సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న సమస్యలకు తోడు రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా కొత్త సమస్యలు, తలనొప్పులూ వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఉద్యోగ భద్రత, ప్రతి నెలా ఒకటవ తేదీ వచ్చేసరికి ఠంఛన్ గా జీతం వస్తుంది అన్న భరోసా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జీతం డబ్బులు 5వ తేదీ వస్తాయో, పదవ తేదీ వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక పోతే సీపీఎస్ రద్దు చేస్తామని జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి రెండున్నరేళ్లు అయినా సీపీఎస్ రద్దు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వం ఒక అధ్యయన కమిటీ లాంటిది కూడా వేయలేదు. అసలు ఆ హామీకే మంగళం పాడినట్లు కనబడుతోంది. ఈ రెండు అంశాలు ఉద్యోగులకు పెద్ద ఆవేదనగా ఉన్నాయి. ఇవి కాకుండా 2019 జూలై నుండి ఇప్పటి వరకూ డీఏలు ఇవ్వలేదు. ఇప్పటి వరకూ మొత్తం అయిదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. పిఆర్సీ అమలు చేయలేదు. ప్రధానంగా ఈ నాలుగు సమస్యలతో పాటు తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరణ తదితర సమస్యలు ఉన్నాయి. ఇన్నాళ్ల నుండి వేచి చూసిన ఉద్యోగ సంఘాల నేతలు సజ్జలను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమింటే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల తరువాత ఇప్పుడే సమస్యలు గుర్తుకు వచ్చాయా? సజ్జలనే ఎందుకు కలిశారు? సజ్జల ఉద్యోగ సంఘాలకు ప్రతినిధి కాదు కదా? ఆయన ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరు, పార్టీ పరంగా ఓ ముఖ్య నేత. ముఖ్యమంత్రి లేదా మంత్రులను ఎందుకు కలవలేదు? అనేవి పరిశీలిస్తే దీనిలో రహస్య ఏజండా ఉందా అన్న అనుమానం కూడా అందరిలో కలుగుతోంది.
ఈరోజు ప్రభుత్వం నుండి కదలిక..!
గత వారం రోజుల పరిణామాలు ఇప్పటికైతే చల్లబడినట్టే కనిపిస్తున్నాయి. సజ్జల మాస్ వార్నింగ్ కి.. ఉద్యోగ సంఘాలు కాస్త కవరింగ్ ఇచ్చుకున్నాయి. అయితే ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తుంది. మొదటి హామీ అమలు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. పీఆర్సీ అమలు చేసేక్రమంలో.. త్వరగా నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీ వేయనున్నట్టు తెలుస్తుంది. జీతాలు కూడా వచ్చే నెల నుండి కచ్చితంగా అయిదు తేదీలోగా వేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించినట్టు సమాచారం. దీనిపై కాస్త స్పష్టత రావాల్సి ఉంది.