ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పలు సంఘటనలు చూస్తుంటే… సుమతి శతకంలోని ఒ పద్యం గుర్తుకు వస్తుంది. ‘ఇతరులను నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అందురూ చదివే ఉంటారు, వినే ఉంటారుగా? ఇప్పుడు కొందరు మేధావులు చేస్తున్న పని అదే కావొచ్చు. తాజాగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీసుకున్న నిర్ణయం కూడా ఎదో జరిగిపోతుంది అనుకుంటే అయన సింపుల్ గా తేల్చేశారు. దేవుడు వార్నర్ లా సిక్సులు కొట్టలేదు..! గవాస్కర్ లా డిఫెన్స్ కూడా ఆడలేదు..! అయన స్టయిల్ లో అయన తప్పించుకుతిరిగారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద, సీఎంఒ కార్యాలయంలోనూ చట్టం, న్యాయ సూత్రాలు, పరిపాలనా విధానాలు తెలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎందరో ఉంటారు. ప్రభుత్వ విధి విధాన నిర్ణయాల్లో ఏమైనా తప్పులు ఉంటే.. వీటి వల్ల మనకు న్యాయపరమైన చిక్కులు ఎదురు అవ్వవచ్చు.. దీన్ని ఇలా చేస్తే ఇబ్బందులు ఉండవు అని సలహా ఇచ్చే బ్యూరోక్రాట్ కూడా నోరు మెదపడం లేదు. ఈ పర్యవ సానంగా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు న్యాయసమీక్ష లను ఎదుర్కోవాల్సి రావడం, పలు నిర్ణయాలు తప్పు అని తేల్చడం జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలు సాహసోపేతంగా, ప్రజా రంజకంగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి అందడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదాహరణలకు తీసుకుంటే.. గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ ల నియామకాలు, రివర్స్ టెండరింగ్, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు, విద్యా వ్యవస్థ లో నాడు – నేడు, దిశ చట్టం, తాజాగా బీసీ ఉప కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ లు ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి. ఇలా ప్రజానీకానికి ఎన్నో మంచి కార్యక్రమాలు అందుతున్నా కానీ పలు నిర్ణయాలపై పూర్తిగా అధ్యయనం చేయకుండా ముందుకు వెళుతున్న కారణంగా కోర్టు అక్షింతలు వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి కారణం తమకు తెలిసిన విషయాలను కూడా మన కెందుకులే అని సైలెంట్ గా ఉంటున్న బ్యూరోక్రాట్స్.
తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏంటో రాజకీయ అనుభవం ఉండి, న్యాయ శాస్త్రంపైనా అవగాహన కల్గిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా సుమతీ శతక పద్యాన్నే అనుసరించారు అనక తప్పదు. ఎస్ఈసి ని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిది కాదని ఇటివలే ఏపి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్లాజ్ పట్టుకొనే గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించినందున అయన నియామకమే చెల్లదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో వాదిస్తున్నది. గవర్నర్ ఎవరి సిఫార్సులు లేకుండా తనకు ఉన్న విచక్షణ అధికారాలతో ఎస్ఈసీ ని నియమించే అధికారం ఉంది. ఈ విషయం కూడా గవర్నర్ గారికి బాగానే తెలుసు. అయినప్పటికీ హైకోర్టు సూచనల మేరకు తన వద్దకు వచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో అయన నుండి విజ్ఞాపన తీసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని ప్రభుత్వానికి పంపి పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేశారు. ప్రభుత్వం అంటే తానే అన్న విషయాన్ని మరిచారు. ఇవన్నీ చూస్తుంటే సుమతీ శతక పద్యంను అనుసరిస్తున్నారని భావించి వచ్చుకదా?