అమరావతి పరిధిలోని భూ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. గత ప్రభుత్వ నిర్ణయాల్లో అక్రమాలు వెలికితీతకు సిట్ వేసింది. ఇవన్నీ టీడీపీ టార్గెట్ గా జరుగుతున్న నిర్ణయాలే అనడంలో సందేహం లేదు. దీని వలన జగన్ ప్రభుత్వానికి లాభమే తప్ప, నష్టమేమీ ఉండదు. ఆ దర్యాప్తు సజావుగా సాగి, జరిగిన అవినీతిని కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు ఉంచేలా ఉండాలి. ఆధారాలతో సహా బహిర్గతమైతే చంద్రబాబు అండ్ బృందానికి చుక్కలు చూపించవచ్చు. అదేం పెద్ద కష్టమైన పని కాదు. ఇలా కాకుండా ఏళ్ల తరబడి విచారణలు కొనసాగి, తూతూమంత్రంగా దర్యాప్తు జరిగితేనే అది ప్రభుత్వానికి మచ్చగా మారుతుంది. మాపై విచారణకు సిట్ వేశారు, ఏమి పట్టుకోలేకపోయారు అంటూ వారు చంకలు గుద్దుకునే అవకాశం ఉంది. అందుకే సిట్ ఏర్పాటు సమంజసమే అయినా దర్యాప్తు తీరే మారాలి. గతంలో పలు సందర్భాల్లో ఏర్పాటు చేసిన సిట్ లు పెద్దగా చేసిందేమీ లేదు.
నిజానికి ప్రస్తుత రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో అవినీతి లేకుండా పరిపాలించడం అంటే అసాధ్యమే. ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా, ఆ పైన మోదీ అయినా తనవారికి ఎంతో కొంత లబ్ది చేకూరిస్తేనే ప్రయోజనాలు ఒనగూరేది. అవి చిన్న విషయాలు. తన అనుకునే వారికి ఏదోలా లబ్ది ఇవ్వడం సాధారణమే. కానీ అసాధారణ రీతిలో పంచి పెట్టడమే అవినీతి.
“ఉదాహరణకు!!! ఇండియన్ రైల్వే లో “రైల్ నీర్” బాటిల్ రూ. 15 కి అమ్ముతున్నారు. దేశ వ్యాప్తంగా రోజుకి 2 కోట్ల బాటిళ్లు అమ్ముడవుతాయి. ఒక్క సౌత్ సెంట్రల్ విజయవాడ జోన్ పరిధిలోనే రోజుకి 4 లక్షల బాటిళ్లు అమ్ముడవుతాయి. ఈ కాంట్రాక్టు ఎక్కడికక్కడ బీజేపీ నాయకుల గుప్పిట్లో ఉంటుంది. ఒక్కో బాటిల్ రూ. 7 కి ఇండస్ట్రీల నుండి వీరు కొంటారు. రూ. 11 కి రైల్వేకి సరఫరా చేస్తారు. రూ. 15కి రైల్వే ప్రయాణికులకు అమ్ముతుంది. ఇక్కడ సదరు కాంట్రాక్టర్ రూ. 4 లాభం పొందుతున్నట్టు. దీనిలో రూ. 2 వరకు రవాణా ఖర్చులు, మామూళ్ల రూపంలో పోయినా…, రూ. 2 జేబులోకి వెళ్తుంది. ఇది మోసం కాదు, ప్రభుత్వ విధానం అలా ఉంది. రూ. 11కి వచ్చే బాటిల్ రూ. 14కి రైల్వే సదరు అమ్మకం దారుడికి ఇస్తుంది. పైన రూపాయి వేసుకుని వారు అమ్ముకుంటారు. ఇక్కడ దేనిలోనూ అవినీతి లేదు. కానీ బీజేపీ నాయకుల ప్రయోజనాలు ఉన్నాయి. ఇదే విధాన పరంగా లబ్ది చేకూర్చడం అంటే.”
తన వారికి అడ్డగోలుగా లబ్ది చేకూరిస్తే అవినీతి. ఉదాహరణకు…!!! గత ప్రభుత్వంలో ఆదరణ పథకం విపరీతంగా అమలు చేశారు. చాలా ఖర్చు చేశారు. పేదవర్గాలకు కావాల్సిన వృత్తి పరికరాలను ప్రభుత్వం అందిస్తుంది. ఈ పరికరాలు పేదలు నేరుగా కొనుక్కుంటే ఒక్కోటీ రూ. 100 ఉంటే.., నాటి ప్రభుత్వం వాటిని రూ. 300 కి కొనుగోలు చేసింది. ఆ సరఫరా కాంట్రాక్టుని నాటి ఒక మంత్రికి సన్నిహితుడికి అప్పగించింది. ఇలా రూ. వేల కోట్లు లబ్ది చేకూర్చింది. ఇది అవినీతి. ప్రభుత్వ ఖాజానాని దోచుకోవడం. ఇలా ప్రతి శాఖలోనూ కోకొల్లలుగా జరిగాయి. ఇప్పటి రాజకీయాల్లో ఎన్నికల ఖర్చులు పెరిగాయి, ముడుపులు పెరిగాయి ఏ నాయకుడూ మచ్చ లేకుండా బయటకు రావడం లేదు. 2004 నుండి జరుగుతున్నది ఇదే. నాడు వైఎస్ పాలనలో తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డారని దేశమంతటా తెలిసింది. దీనిలో రాజకీయ కోణాలు ఉన్నప్పటికీ…, ఎంతో కొంత జరగడం మాత్రం వాస్తవమే. అందుకే జగన్ ని ఎవరు విమర్శించాలన్నా ముందుగా అదే మాట “అవినీతిపరుడు” అనే అంటారు. ఇది చెరుపుకోవడమే ఆయన లక్ష్యం. అందుకే ఇప్పుడు అవినీతిరహిత పాలన అంటున్నారు. అఫ్ కోర్స్… “అవినీతి రహిత” పాలన అనడమే ఒక ఫ్యాషన్ గా మారింది. గడిచిన టీడీపీ పాలనలో చంద్రబాబు పదే పదే అదే బాకా ఊదేవారు. ఒక్క రూపాయి అవినీతి లేదంటూ చెప్పుకొచ్చేవారు.
అయితే వారు చేసిన తీరు, పాల్పడిన అక్రమాలు, పంచుకున్న వాటాలు, చేసిన పాపాలు బయటకు రావు అనుకునే భ్రమలో అయితే చేయరు. “మేనేజ్ కెపాసిటీ” తోనే, మనదేలే అనే ధీమాతోనే చేస్తుంటారు. మేనేజ్ కెపాసిటీ లేక.., జగన్ అనే వ్యక్తి పట్టుదలతో నాటి అక్రమాలు వెలికితీత ఆరంభమయ్యింది. ఇదే తరుణంలో ప్రస్తుత ప్రభుత్వంలోనూ అవినీతి జరడగంలేదు అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ఆరంభదశలో ఉంది. అడ్మినిస్ట్రేషన్ కరప్షన్ జరగడం లేదు. కొంతవరకు అదుపులో ఉంది. కానీ పొలిటికల్ కరప్షన్ మాత్రం అదే దశలో ఉంది.
ఇక సిట్ విషయానికి వద్దాం. విచారణకు సిట్ ఏర్పాటు చేయడం సహజమే అయినా వాటి పనితీరులోనే లోపాలు ఉంటున్నాయి. రాజకీయ కోణంలో ఏర్పాటు జరిగితే రాజకీయ కోణంలోనే విచారణ జరుగుతుంది.
విశాఖపట్నంలో భూ కుంభకోణాలు విచారణకు మూడేళ్ళ కిందట సిట్ వేశారు. నేటికీ పట్టుకున్నది లేదు, బయటపెట్టింది లేదు. వైఎస్ వివేకా హత్య కేసుపై సిట్ వేశారు. దర్యాప్తు నేడూ, రేపు ముగుస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. అంతకు ముందు విజయవాడలో అయేషా మీరా హత్య కేసులో వేసిన సిట్ శాశ్వత నిద్రలోనే ఉంది. తప్పులతడకల విచారణ సాగింది. ఇవన్నీ రాజకీయ కోణంలో జరిగిన విచారణలే. అందుకే ఎటూ తేలలేదు. అయితే తాజాగా సిట్ ఏర్పాటు మాత్రం భిన్నంగా ఉంది. పది మంది అధికారులను వేయడం, అందర్నీ ఐపీఎస్ లను రంగంలోకి దించడం ద్వారా జగన్ ప్రభుత్వ ఉద్దేశం వెల్లడవుతుంది. ఈ సిట్ దర్యాప్తుకి సర్వాధికారాలు ఇచ్చి మరీ దూకుడు పెంచారు. ప్రాధమికంగా బహిరంగమైన భూ అక్రమాలపై లోతుగా ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది. ఎన్ని నెలలు సమయం తీసుకుంటుంది? ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? టీడీపీ వచనాలు వాస్తవమవుతాయా? అనేది సిట్ చేతిలో ఉంది, భవిష్యత్తులో తేలనుంది.
సిట్ “స్టాండ్” పెరగాలి…
శ్రీనివాస్ మానెం