దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను రెండు వారాలు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. పలు ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వం వివిధ ప్రాంతాలలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కార్మికులకు తీపి కబురు అందించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉండిపోయిన వలస కార్మికులు వారి వారి ఇళ్లకు చేరడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులు 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్లకు మాత్రమే రాకపోకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
రిలీఫ్ క్యాంప్ల్లో నుంచి స్వగ్రామాలకు వెళ్లాలని భావించే వారికి ర్యాండమ్గా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని బస్సులో 50 శాతం మించకుండా తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. వారు స్వగ్రామాలకు చేరుకున్న తర్వాత కూడా మరోసారి 14 రోజుల క్వారంటైన్, అనంతరం మరో 14 రోజులు హోం ఐసోలేషన్లో ఉండాలని స్పష్టం చేసింది. ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తిస్తే ఆ గ్రూప్ మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా సూచించారు.
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోవిడ్ 19 ప్రత్యేక అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, రైల్వే స్టేషన్ గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్, బస్టాండ్కు మాత్రమే చేరుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. వచ్చిన వారికి స్క్రీనింగ్ సహా పూల్ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో రెడ్జోన్, కంటైన్మెట్ జోన్ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించింది. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటైన్కు పంపి పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.
దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి రెండవ విడత లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే మూడవ తేదీ వరకు కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.