అమారావతి పేరెత్తకుండానే అవే లెక్కలతో..!
ఆర్థిక సంఘానికి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు
మూడు రాజధానుల వ్యవహారం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్. రాజకీయంగా..లీగల్ గా ఇప్పుడు ఇది వివాదస్పదంగా మారింది. కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఇంతలో ఇప్పటి వరకు అమరావతి గురించి పెద్ద గా ఆలోచన చేయని ప్రభుత్వం సడన్ గా..అమరావతిలో మధ్యలో నిలిచిన భవనాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం దాదాపుగా 14 నుండి 15 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇక, ఇదే సమయంలో ఏపీ ఆర్దిక పరిస్థితిని వివిరిస్తూ 15వ ఆర్దిక సంఘానికి తాజాగా పలు ప్రతిపాదనలు పంపింది. మొత్తంగా 9.94 లక్షల కోట్లను కేటాయించాలని అభ్యర్ధించింది. కరోనా వేళ ఏరకంగా రాష్ట్ర ఆర్దిక పరి స్థితి దెబ్బతిందీ..విభజన తరువాత జరిగిన నష్టాలను వివరించింది. ఇవన్నీ రాష్ట్ర విభజన సమయం నుండి నాడు టీడీపీ..నేడు వైసీపీ ప్రభుత్వాలు అందిస్తున్న వివరాలే. అయితే, ఈ సారి ప్రభుత్వం అభ్యర్ధన లో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. రాజధానికి 60 వేల కోట్లు..విశాఖ అభివృద్ధికి 4 వేలకోట్లు అవసరమని ఆ నివేదికలో పేర్కొంది. ఇదే..ఇప్పుడు అందరినీ ఒక్క సారిగా విస్మయానికి గురి చేసింది. రాజధాని అంటే ప్రభుత్వ ఉద్దేశంలో ఏ ప్రాంతం..మరి విశాఖ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన దేనికి..అసలు జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన లెక్కల వెనుక అసలు విషయం ఏంటనేదే ఇప్పుడు చర్చ…
రాజధానికి 60 వేల కోట్లు…పేరు చెప్పకుండానే
రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ…తాము ఏ రకమైన సాయం కోరుకుంటున్నామో విశ్లేషిస్తూ ఏపీ ప్రభుత్వం 15వ ఆర్దిక సంఘానికి 108 పేజీల లేఖ అందించింది. అందులో ఏపీలోని ఆర్దిక స్థితి గతులను వివరించింది. ఏపీకి తక్షణ గ్రాంట్ల కింద 3.26 లక్షల కోట్లు ఇవ్వాలని కోరింది. రానున్న అయిదేళ్ల కాలానికి 9.94 లక్షల కోట్ల సాయం చేయాలని అభ్యర్ధించింది. ఇదే సమయంలో ఇప్పుడు ఏపీలో మూడు రాజధానుల పైన రగడ కొనసాగుతన్న వేళ రాజధాని నగర నిర్మాణంతో పాటుగా అభివృద్ధి కి నిధులు కేటాయించాలని కోరింది. అయితే గత ప్రభుత్వం ఇదే విధంగా అమరావతి నిర్మాణం.. అభివృద్ధి కోసం 1,09,023 కోట్ల ప్రతిపాదనలను సమర్పించింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆర్దిక సంఘానికి ఇచ్చిన నివేదికలో రాజధాని అని మాత్రమే ప్రస్తావించింది. కానీ, రాజధాని పేరు ప్రస్తావించకుండానే నిధులు కేటాయించాలని కోరింది. గత ప్రభుత్వం కోరిన విధంగానే అదే మొత్తాన్ని కోరటం ద్వారా పరోక్షంగా అమరావతికే ఈ నిధులు కోరినట్లుగా అర్దం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో కేంద్రం ప్రభుత్వ భవనాల కోసం రూ 2500 కోట్లు ఇస్తామని చెప్పిందని..కానీ, రూ 1500 కోట్లు ఇచ్చిందనే చెప్పటం ద్వారా పేరు ప్రస్తావించకపోయినా ఇదంతా అమరావతి గురించే అనే చర్చ వినిపిస్తోంది. గత ప్రభుత్వ లేఖలనే తిరిగి రాసారా..లేక, ఇందులో ఏమైనా వ్యూహం ఉందా అనే కోణంలోనూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది.
విశాఖకు ప్రత్యేక నిధుల కోసం అభ్యర్ధన..
ఇదే నివేదికలో ఏపీ ప్రభుత్వం తాము పరిపాలనా రాజధానిగా ఖరారు చేసిన విశాఖ కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరింది. ఇందు కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వం అభ్యర్ధించింది. విశాఖ నగరంలో మౌళిక వసతలు కల్పన కోసం ఈ నిధులు ఖర్చు చేస్తామంటూ చెప్పుకొచ్చింది. ఏపీ డెవలప్ మెంట్ లో విశాఖ కీలకంగా నిలిచిందని అందులో వివరించింది. గతంలో సీఎం అసెంబ్లీలో చెప్పిన విధంగా విశాఖ సైతం హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి కి ఆస్కారం ఉందంటూ వివరించింది. విశాఖ విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు..ప్రభుత్వ ఆలోచనలు ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో కొత్తగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమీ లేవు. కానీ, గత ప్రభుత్వం అమరావతి పేరుతో చేసిన ప్రతిపాదనలనే..ఇప్పుడు ప్రభుత్వం అమరావతి అనే పేరు ప్రస్తావించకుండా రాజధాని పేరుతో తిరిగి ప్రతిపాదించటం మాత్రం చర్చకు కారణమవుతోంది. అమారావతిలో అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి చేయాలంటే దాదాపు 15 వేల కోట్లు అవసరం అవుతుందనే అంచనాకు వచ్చిన ఏపీ ప్రభుత్వం..ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పిన లెక్కలనే తిరిగి ఆర్దిక సంఘానికి నివేదించటం పైన అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక రాజకీయంగా..పాలనా పరంగా వ్యూహం ఏమైనా ఉందా.. లేక అధికారులే ఈ విధంగా నివేదికలు సిద్దం చేసి ఆర్దిక సంఘానికి సమర్పించారా అనేది తేలాల్సిన విషయం. అయితే, కేంద్ర ఆర్దిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు నిధులు అందనున్నాయి. మరి.. అంత కీలకమైన నివేదికలో రాజధానికి నిధులు 60 వేల కోట్లు అంటూ…విశాఖకు 4 వేల కోట్లు అంటే ప్రస్తావించటమే ఈ చర్చలకు అసలు కారణం. దీని పైన ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.