AP High Court: వైసీపీ రాజకీయ భవిష్యత్తును, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రస్తుతం హైకోర్టు భుజాల మీద మోస్తోంది. హైకోర్టు అనే కంటే మొన్న పదవీ బాధ్యతలు చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా భుజస్కందాలపైనే ఉన్నట్లుగా భావించవచ్చు. రాజకీయ పార్టీ భవిష్యత్తు, రాజకీయ నాయకుడి భవిష్యత్తు హైకోర్టు ప్రధాన నాయమూర్తి భుజస్కందాలపై ఎందుకుఅనే అనుమానం రావచ్చు…! హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి.., సీఎం జగన్ భావితాని నిర్దేశించే ఓ కీలక కేసు పెండింగ్ లో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో తీసుకున్న అతి పెద్ద సంచలనాత్మక నిర్ణయం అదే.. ఆ నిర్ణయం కోర్టు ఆమోదిస్తే ఒకే.., లేకపోతే మళ్ళీ కథ మొదటికి వెళ్తుంది.. అదే రాజధాని మార్పు/ రాజధాని వికేంద్రీకరణ/ ముచ్చటగా మూడు రాజధానుల నిర్ణయం అని చెప్పొచ్చు..! ఇది హైకోర్టులో 2020 ఏప్రిల్ నుండి విచారణ దశలోనే ఉంది. అంటే దాదాపు సంవత్సరం ఆరు నెలలకు పైగా హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పటికి ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు మారినా దానిపై తుది తీర్పు రాలేదు. ఇప్పుడు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వచ్చారు. ఈయన హయాంలో దానిపై తుది తీర్పు వస్తుందా. రాదా అనేది ఓ పెద్ద ప్రశ్న. ఈ సీజే ఏడాదో ఏడాదిన్నరో తరువాత బదిలీ అవుతారు. ఈ లోగా మూడు రాజధానులపై తుది తీర్పు రాకపోతే ప్రభుత్వానికి పెద్ద మచ్చ. ఎందుకంటే రాజధాని వికీంద్రీకరణను వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతకు ముందు అమరావతి రాజధానిగా ఉండేది. గతంలో అమరావతి రాజధానిలో కాస్తా కూస్తో పనులు జరిగాయి.
AP High Court: నవంబరు నుండి మరో కథ..!?
అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది, భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు కానీ వాటిపై నిరూపణలు చేయలేకపోయారు. చట్టంలో, న్యాయస్థానాల ముందు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను నిరూపించలేకపోయారు. కాకపోతే రాజకీయంగా ప్రజల నుండి నిలబెట్టారు కాబట్టి 2019 ఎన్నికల్లో అమరావతిలో కూడా టీడీపీకి ఓట్లు పడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధాని గా పేర్కొంటూ జగన్మోహనరెడ్డి సర్కార్ నిర్ణయించి ఉత్తర్వులు ఇచ్చేసింది. సీఆర్డీఏ బిల్లు రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులను వ్యతిరేకిస్తూ దాదాపు 236 పిటిషన్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. 2020 ఏప్రిల్ లో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం వాటన్నింటినీ జల్లేడ పట్టి 18 పిటిషన్లను విచారణకు స్వీకరించారు. 2020 డిసెంబర్ నాటికే జేకే మహేశ్వరి ధర్మాసనం ఈ పిటిషన్లపై మొత్తం సమాచారం తెప్పించుకుని 70 శాతం విచారణను పూర్తి చేసింది. నాలుగు నెలల పాటు రోజు వారి విచారణ శరవేగంగా జరిగింది. ఆ తరువాత జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ అవ్వగా ఆయన స్థానంలో జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి వచ్చారు. అయితే ఆయన ఇది ఓ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక కేసు, కావున తాను మొదటి నుండి విచారణ చేపడతానని చెప్పారు. అంతకు ముందు సీజే విచారణతో తనకు సంబంధం లేదు, మొత్తం కేసు వింటాను అని స్పష్టం చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ తరువాత రోజు వారి విచారణ చేపడతామని చెప్పారు. కోవిడ్ సెకండ్ వేవ్ పూర్తి అయిన తరువాత సెప్టెంబర్ 15న ఈ కేసు విచారణకు రాగా ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే కేసు కాదు, అత్యంత కీలకమైన కేసు దీన్ని భౌతిక వాదనలతో విచారణ కొనసాగించేందుకు గానూ నవంబర్ 15వ తేదీకి వాయిదా వేశారు. నవంబర్ 15వ తేదీకి ఆయన లేరు.
గూగుల్ వెక్కిరిస్తుంది..!
ఇప్పుడు కొత్త సీజేగా వచ్చారు. నవంబర్ 15 నుండి కొత్త సీజే మొదటి నుండి కేసు విచారణ చేపట్టాలి. దాదాపు ఏడాదిన్నర నుండి రాజధాని వికేంద్రీకరణ అంశం తేలకపోతే ఈ సీజే హయాంలో అయినా తేలుతుందా లేదా ఒక వేళ ఏమి తేలకపోతే వైసీపీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ సర్కార్ ఉన్న రాజధానిలో అభివృద్ధి చేయడం లేదు, పనులు ఆపేశారు. మూడు రాజధానులు అన్నారు కాదా అక్కడ విశాఖలో ఏమైనా చేస్తున్నారా అంటే అక్కడా ఏమి జరగడం లేదు. కోర్టు కేసు పెండింగ్ లో ఉన్నంత మాత్రన విశాఖలో పరిశ్రమలు పెట్టవచ్చు, అభివృద్ధి చేయవచ్చు కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పరిపాలనా రాజధాని అయితేనే పరిశ్రమలు వస్తాయా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారా అన్నది ప్రశ్న, రాజధాని వికేంద్రీకరణ నిర్ణయంలో రాజకీయం కనిపిస్తోంది కానీ చిత్తశుద్ధి కనిపించడం లేదు అన్న మాట వినబడుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై తుది తీర్పు రాకపోతే రాజకీయంగా వైసీపీకి రాజకీయంగా దెబ్బేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందే రాజధాని వికేంద్రీకరణపై సానుకూల తీర్పు వచ్చి, మూడు రాజధానుల్లో ఏడాది పాలన జరిగి ప్రగతి కనిపించి ఉంటే జగన్మోహనరెడ్డి చెప్పినదాన్ని ప్రజలు విశ్వసించే వాళ్లు. హైకోర్టులో ఇది తేలకపోవడం వల్ల వైసీపీ రాజకీయ భవిష్యత్తు గాలిలో ఉన్నట్లే. ప్రస్తుతం ఏపికి రాజధాని ఏది అంటే ఎవరు ఠక్కున సమాధానం చెప్పే పరిస్థితి లేదు. గూగూల్ లో ఏపి రాజధాని కోసం సెర్చ్ చేస్తే స్పష్టంగా చెప్పలేకపోతోంది. అమరావతి, విశాఖ, కర్నూలుతో పాటు హైదరాబాద్ ను కూడా చూపుతోంది.