ఏపీలో అధికార వికేంద్రీకరణ..సీఆర్డీఏ చట్టం రద్దు పైన హైకోర్టు స్టేటస్ కో ను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రాజధానుల బిల్లులు చట్టం రూపం దాల్చిన వెంటనే..వాటిని అమలు చేయకుండా స్టే ఇవ్వాలంటూ అమరావతి జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. దీని పైన విచారించిన త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకూ ఈ నెల 14వ తేదీ వరకు చట్టాలను అమలు చేయకుండా యధాతధ స్థితి కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం గురువారమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీని పైన ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులోనూ స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ రోజు తిరిగి హైకోర్టులో విచారణ నిర్వహించిన ధర్మాసనం స్టేటస్ కో ను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే సమయంలో హైకోర్టులో రాజధానుల అంశం పైన దాఖలైన 32 పిటీషన్లు..నివేదికలు ఇచ్చిన రెండు కమిటీల రిపోర్టులను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటీషన్ల పైనా కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ఈ నెల 17న విచారణకు రానుంది. సుప్రీంలో ఇప్పటికే హైకోర్టు జారీ చేసిన స్టేటస్ కో ఉత్తర్వులను నిలిపి వేయాలని ప్రభుత్వం తన పిటీషలో కోరింది. దీని పైన సుప్రీం తీసుకొనే నిర్ణయం ఆధారంగా రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే, తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో మూడు రాజధానులు.. సీఆర్డీఏ చట్టం అమలు విషయంలో ప్రభుత్వం ఈ నెల 27వ తేదీ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.