AP High Court: ముఖ్యమంత్రిగా గతంలో నందమూరి తారక రామారావు పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. చాలా కొత్త చట్టాలను తీసుకువచ్చారు. మహిళలకు ఆస్తిలో హక్కు, మాండలిక వ్యవస్థ, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు లాంటి కీలక అంశాలతో పాటు లోకాయుక్త అనే వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అంతర్గత వ్యవహారాలు జరిగినా, ప్రభుత్వ ఉద్యోగులు తప్పుడు సర్టిఫికెట్లతో నేరాలకు పాల్పడినా, ఇతర ప్రభుత్వ వ్యవహారాల్లో తప్పులకు సంబంధించి త్వరితగతిన విచారణ జరిపేందుకు ఈ లోకాయుక్త ఏర్పడింది. కోర్టులకు వెళ్లడం, ఎక్కువ కాలం కేసులు విచారణ జరగడం లాంటివి నిరోధించబడేందుకు ఈ లోకాయుక్త ఏర్పడింది. ఇందులోనూ రిటైర్డ్ న్యాయమూర్తులు కేసులను విచారిస్తారు. అయితే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబుపై లోకాయుక్త ఆదేశాలతో సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేయడంతో కొత్త అంశం తెరపైకి వచ్చింది. అసలు సీఐడీకి కేసు బదలాయించే అర్హత లోకాయుక్త కు ఉందా..? అనే ప్రశ్న తలెత్తింది. అశోక్ బాబు తప్పుడు విద్యార్హతతో ప్రమోషన్ పొందారన్న అభియోగంపై కిరణ్ కుమార్ ప్రభుత్వ హయాంలోనే విచారణ జరిగింది. అప్పడే లోకాయుక్త విచారణ చేపట్టి విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణ అనంతరం అశోక్ బాబుకు క్లీన్ చిట్ ఇచ్చేశారు.
లోకాయుక్త పరిధిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆయన రిటైర్ అయిన తరువాత టీడీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలపై పాత కేసులు తిరగదోడే ప్రయత్నంలో భాగంగా అశోక్ బాబు తప్పుడు దృవీకరణ పత్రాల అంశం వెలుగులోకి వచ్చింది. తప్పుడు దృవీకరణ పత్రాలతో ప్రమోషన్ పొందాడు అనేది ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. లోకాయుక్త ఆదేశాలతో సీఐడీ కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయడంతో అశోక్ బాబుపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లోకాయుక్త నేరుగా సీఐడీ విచారణకు ఆదేశించవచ్చా..? అటువంటిది ఏమైనా ఉంటే లోకాయుక్త విచారణ పూర్తి చేసి హైకోర్టుకు నివేదించాలి. లేదా ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలి అంతే కానీ నేరుగా సీఐడీ విచారణకు ఆదేశించడం ఏమిటి..? అని హైకోర్టు ప్రశ్నించింది. లోకాయుక్తలోనూ రిటైర్డ్ న్యాయమూర్తే విచారణ జరుపుతారు. ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఇప్పుడు లోకాయుక్తపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అసలు లోకాయుక్త పరిధి ఏమిటి.. ? లోకాయుక్త విచారణకు ఆదేశించవచ్చా..? అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది.
AP High Court: అశోక్ బాబు కేసులో అనేక పరిణామాలు
అశోక్ బాబు కేసులోనే కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. విజిలెన్స్ విచారణ జరిపి క్లోజ్ చేసిన అంశంపై మళ్లీ లోకాయుక్త కల్పించుకోవడం, సీఐడీ విచారణకు ఆదేశించడం, సీఐడీ కూడా మొదట బెయిలబుల్ సెక్షన్ లతో కేసు నమోదు చేసి అరెస్టు చేసే సమయంలో నాన్ బెయిలబుల్ సెక్షన్ జోడించడం ఇలా అనేక పరిణామాలు జరగడంతో హైకోర్టు ఈ అంశంలో సీరియస్ గానే విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సీఐడీ కోర్టు నిన్న రాత్రి అశోక్ బాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఆయన బయటకు వచ్చేశారు. సీఐడీ నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టినప్పటికీ అరెస్టు సమయంలో సీఐడీ నిబంధనలు పాటించలేదనీ, కక్షసాధింపు చర్యలో భాగంగానే తప్పుడు కేసు నమోదు చేశారనీ, ఎఫ్ఐఆర్ లో సెక్షన్ లు మార్చిన అంశాలను అశోక్ బాబు తరపు న్యాయవాది న్యాయమూర్తికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అశోక్ బాబుకు 20వేల వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారు.