ఏపీ క్యాబినెట్ లో మార్పులు జరిగిపోయాయి. రాజ్యసభకు వెళ్లిన ఇద్దరి స్థానాల్లో ఇద్దరు కొత్తగా వచ్చి చేరిపోయారు. ప్రస్తుతానికి ఇంకేమి మార్పులు లేవు. కానీ అక్కడక్కడా మాత్రం ఒక ప్రచారం జరుగుతుంది. మంత్రి వర్గంలో చిన్నపాటి మార్పులు ఉంటాయని, ఓ మంత్రిని తప్పించి…, పక్క నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకి అవకాశం ఇస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరు..? ఎందుకు తప్పిస్తారు..? జగన్ అంతరంగం ఏమిటి..? అనేది ఒకసారి చూసుకుంటే..!!
శ్రీ రంగ రంగా… ఇలా అనూహ్యంగా…!
అసలు ఏ మాత్రం ఊహించకుండా… అనుకోకుండా… కనీసం కలగనకుండా మంత్రిగా మారిన వ్యక్తి శ్రీరంగనాధరాజు. మంత్రి పదవి వస్తుందని పూర్తిగా ఆశలు పెట్టుకుని, రాకపోతే నిరాశ చెందిన ఎమ్మెల్యే ప్రసాదరాజు. ఇద్దరూ ఒకే జిల్లా, ఒకే సామాజికవర్గం, ఒకే ప్రాంతం… పక్క పక్క నియోజకవర్గాలు. శ్రీరంగనాధరాజు 2004 లో అత్తిలి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.., 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో అత్తిలి తణుకులో కలిసిపోవడంతో తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరి, మళ్ళీ ఆచంట నుండి పోటీ చేసి గెలుపొందారు. అనూహ్యంగా మంత్రయ్యారు. ఆయనకు జిల్లాలో పెద్దగా పట్టు లేదు, ఆ సామాజికవర్గంలో తనకంటే బలమైన, సీనియర్ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పోటీగా ఉన్నారు. కానీ జగన్ ప్రసాదరాజుని కాదని, రంగనాధరాజుకి మంత్రి పదవి కట్టబెట్టారు. దీన్ని సద్వినియోగం చేసుకోకుండా… ఈ ఏడాది కాలంలోనే అనేక ఆరోపణలు, అనేక పిర్యాదులు జగన్ కి చేరాయి. దీంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలయింది.
ప్రసాద రాజు పోటీలోకి మళ్ళీ…!
శ్రీరంగనాధరాజుని తప్పించి, ప్రసాదరాజుకి మంత్రి పదవి ఇస్తారంటూ కొద్దీ కాలం నుండి ప్రచారం జరుగుతుంది. దీనికి అనేక కారణాలు చెప్పుకుంటున్నారు. ప్రసాదరాజు సీనియారిటీ, జగన్ తో ఉన్న సాన్నిహిత్యం.., శ్రీరంగనాధరాజుపై ఆరోపణలు, ఫిర్యాదులతో జగన్ ఆగ్రహంగా ఉండడం.., పైగా ఇటీవల నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు కేంద్రానికి ఓ పిర్యాదు చేయడం.., జిల్లాలో తమ సామాజికవర్గంలో పూర్తిస్థాయిలో పట్టు సంపాదించలేకపోవడం… ఇలా అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఒకవేళ మంత్రివర్గంలో మార్పులు జరిగితే శ్రీరంగనాధరాజుని తప్పించి ప్రసాదరాజుకి కచ్చితంగా ఇస్తారంటూ పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది.